CM Revanth Reddy Kodangal Tour: కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళతానని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి తన సొంత నియోజకవర్గానికి ఆయన వెళ్లారు. తన ఇంటి వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. మహబూబ్ నగర్ లోక్ సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కొండగల్ నుంచే 50 వేల మెజార్టీ రావాలన్నారు.
ఎక్కడ ఉన్నా తన దృష్టి ఎప్పుడూ కొడంగల్ నియోజకవర్గంపైనే ఉంటుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టంచేశారు. పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. సిమెంట్ పరిశ్రమ నిర్మాణం కానుందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల భూముల రేట్స్ పెరుగుతాయన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు.
ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఎన్నికల సమయంలో సెలవులు వస్తున్నాయని యాత్రలకు కొందరు ప్లాన్ చేసుకుంటారన్నారు. కానీ ఓటు మాత్రం చాలా విలువైనదని పేర్కొన్నారు. తనకు ఇతర కార్యక్రమాలున్నా.. ఓటు వేయడం కోసమే కొడంగల్ వచ్చానని తెలిపారు. అలాగే కార్యకర్తలను కలుసుకునేందుకే వచ్చానన్నారు.
Also Read: ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. గెలుపు పక్కా అంటున్న కాంగ్రెస్
తాను కష్టాల్లో ఉన్న సమయంలో ప్రజలే తన వెంట ఉన్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాను ఎన్నికల ప్రచారానికి రాకపోయినా గెలిపించారన్నారు. హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో ఏప్రిల్ 6న నిర్వహించనున్న కాంగ్రెస్ బహిరంగ సభకు కొడంగల్ నుంచి 25 వేల మంది రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.