TG CMR Recovery: రాష్ట్రంలో ధాన్యం సేకరణ నుంచి మిల్లింగ్ ప్రక్రియ వరకు ప్రతీ దశలోనూ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వానికి దక్కాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బకాయిల వసూలు ప్రతి ఏటా అడుగుడడుగునా అడ్డంకులను ఎదుర్కొంటోంది. కేవలం తనిఖీలు, నామమాత్రపు కేసులు నమోదు చేయడంతోనే సరిపెడుతున్న యంత్రాంగం, క్షేత్రస్థాయిలో అసలు బకాయిలను రాబట్టడంలో మాత్రం పూర్తిగా చేతులెత్తేస్తోందని విమర్శలు వస్తున్నాయి. పటిష్టమైన చర్యలు తీసుకోవడంలోనూ ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించి మిల్లింగ్కోసం మిల్లర్లకు అప్పగిస్తున్నప్పటికీ, సకాలంలో బియ్యం తిరిగి ప్రభుత్వానికి (సీఎంఆర్ రూపంలో) చేరడం లేదు. మిల్లర్లు ఇష్టారాజ్యం కారణంగానే బియ్యంను నిర్ణీత సమయంలో అప్పగించడం లేదని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ తనిఖీల్లో అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. రికార్డుల్లో ఒకలా, మిల్లుల్లో మరోలా నిల్వలు కనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్న ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అక్రమాలకు పాల్పడుతున్న మిల్లర్లపై పకడ్బందీ చర్యలు శూన్యమనే విమర్శలున్నాయి. ఈ తతంగానికి కొందరు కిందిస్థాయి పౌరసరఫరాల శాఖ అధికారుల అండదండలు మెండుగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం గడువు ముగిసినా సీఎంఆర్ ఇవ్వని మిల్లులను ‘డిఫాల్ట్’ జాబితాలో చేర్చి కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లుల సంఖ్య ఏకంగా 450కి పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల విలువైన బియ్యం లేదా నగదు మిల్లర్ల వద్దే నిలిచిపోయింది. నోటీసులు ఇవ్వడం, హడావుడి కేసులు పెట్టడం మినహా అసలు రికవరీ దిశగా ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
Also Read: షాంపూ వాడితే ఫాగ్ మాయం.. కానీ, ఈ తప్పు అస్సలు చేయొద్దు!
నిబంధనల ప్రకారం నిర్దేశిత గడువులోగా సీఎంఆర్ అప్పగించని మిల్లులను ‘డిఫాల్ట్’ జాబితాలో చేర్చాలి. వాటిపై చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో డిఫాల్ట్ అయిన రైస్ మిల్లుల సంఖ్య ఏకంగా 450కి పైగానే ఉన్నట్లు సమాచారం. జాబితాను సైతం అధికారులు రూపొందించినట్లు సమాచారం. ప్రభుత్వానికి రావాల్సిన కోట్ల రూపాయల విలువైన బియ్యం లేదా దానికి సమానమైన రికవరీ నిధులు మిల్లర్ల వద్దే ఉంది. కేసులు నమోదు చేయడం, నోటీసులు ఇవ్వడంతోనే సరిపెడుతున్న యంత్రాంగం, అసలు బకాయిలను రాబట్టడంలో మాత్రం పూర్తిగా విఫలమవుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. రికవరీ దిశగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో అత్యంత కీలకం, రైతులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పౌరసరఫరాల శాఖపై మంత్రి పర్యవేక్షణ కొరవడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాఖాపరమైన సమీక్షలు నామమాత్రంగా మారుతుండటంతో కిందిస్థాయి అధికారుల్లో జవాబుదారీతనం కొరవడింది. ఫలితంగా మిల్లర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.శాఖ మంత్రి సీరియస్గా దృష్టి సారించి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తేనే తప్ప ఈ ప్రక్షాళన సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కోట్ల రూపాయల అక్రమాలు, నిల్వల మాయం వెలుగుచూస్తున్న తరుణంలో.. అసలు ఈ సీఎంఆర్ బకాయిలను ప్రభుత్వం ఎలా రాబడుతుందనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. కేవలం ఆకస్మిక తనిఖీలు, దాడులు చేయడం వల్ల ప్రయోజనం లేదని, డిఫాల్ట్ అయిన మిల్లర్లపై క్రిమినల్ చర్యలు వేగవంతం చేసి, ఆస్తుల జప్తు ద్వారా బకాయిలను పూర్తిగా రికవరీ చేయాలని పలువురు కోరుతున్నారు. శాఖ అధికారులపై సైతం నిఘా పెట్టాలని, మిల్లర్లకు సహకరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు సైతం వస్తున్నాయి. మిల్లర్లకు ధాన్యం అప్పగించినట్లు లెక్కలు వేసిన అధికారులు.. రికవరీలో ఆ చొరవ ఎందుకు చూపడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుని సీఎంఆర్ బకాయిలు నూటికీ నూరుశాతం వసూలు చేసి ప్రజాధనాన్ని కాపాడేలా చర్యలు తీసుకుంటుందా? లేదా అనేది చూడాలి.
Also Read: విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు