KTR Vs Kavitha: బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు రాష్ట్ర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్గా మారుతోంది. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వ్యవహార తీరు ఆ పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షురాలిగా పదేళ్లకు పైగా ఉన్న కవితను ఇటీవల అనూహ్యంగా ఆ పదవి నుంచి అధిష్టానం తొలగించింది. దాంతో బీఆర్ఎస్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎటు నుంచి ఎటు దారితీస్తాయో అని గులాబీ శ్రేణుల్లో గుబులు రేగుతోందంట.
తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం చూట్టు బీఆర్ఎస్ రాజకీయం
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చూట్టు బీఆర్ఎస్ ఇంటర్నల్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. అన్యూహ్యంగా టీబీకేఎస్ అధ్యక్షురాలి పదవి నుంచి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తప్పించడం…ఆమె స్థానంలో కొప్పుల ఈశ్వర్ను ఇన్ చార్జిగా నియమించినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించడం చకచకగా జరిగిపోయాయి. కవిత అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఇదంతా జరగడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామాలపై స్పందించిన కవిత తనపై కక్ష గట్టారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
హిందూ మజ్దూర్ సభ సంచలన ప్రకటన
ఈ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతున్న వేళ జాతీయ కార్మిక సంఘమైన హిందూ మజ్దూర్ సభ సంచలన ప్రకటన చేయడం రాజకీయంగా పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారిసింది. టీబీకేఎస్ నుంచి కవితను తప్పించిన తర్వాత హెచ్ఎంఎస్లోకి కవితను ఆ సంఘం నేతలు ఆహ్వానించారు. కవితను హెచ్ఎంఎస్ గౌరవాధ్యక్షురాలుగా ఎన్నుకోవాలని ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ తెలిపారు. సింగరేణి జాగృతి, హెచ్ఎంఎస్ కలిసి సింగరేణిలో పని చేయాలని నిర్ణయించుకున్నాయని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహించే జనరల్ బాడీ సమావేశంలో ఏకగ్రీవ తీర్మనం జరుగనుందని వెల్లడించారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్ రాజకీయాల్లో భారీ మార్పులకు నాంది కాబోతుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది.
మరింత ముదిరిన కేటీఆర్ వర్సెస్ కవిత వివాదాలు
తాజా పరిణామాలు చూస్తే కేటీఆర్ వర్సెస్ కవిత వివాదాలు మరింత ముదిరినట్లు కనిపిస్తోందంటున్నారు. బీఆర్ఎస్లో తన పట్ల జరుగుతున్న పరిణామాలపై కవిత బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. తన తండ్రికి రాసిన లేఖ బహిర్గతం అయిన నాటి నుంచి కవిత చేసిన వ్యాఖ్యలతో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయంటూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్ నేతలపై కవిత రియాక్ట్ అయిన తీరు పార్టీలో అలజడి రేపుతోంది. ముఖ్యంగా గత కొంత కాలంగా కేటీఆర్ వర్సెస్ కవిత మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ ముదిరిపాకాన పడుతోందనే చర్చ జరుగుతోంది. కేటీఆర్ విషయంలో రోజు రోజుకు వాయిస్ పెంచుతున్న కవిత.. పార్టీలో ముఖ్యమైన వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉండి కేవలం ట్వీట్లకే పరిమితం అయితే సరిపోతుందా అని పరోక్షంగా కేటీఆర్ ను నిలదీసిన తీరు సంచలనం రేపుతోంది.
టీబీకేఎస్ తొలగించగానే ఆహ్వానం పంపిన హెచ్ఎంఎస్
కవిత విమర్శల దాడి పెంచుతున్న నేపథ్యంలో ఆమెను టీబీకేఎస్ అధ్యక్షురాలి పదవి నుంచి కేటీఆర్ తొలగించడం బీఆర్ఎస్ లో బిగ్ ట్విస్ట్ గా మారింది. అయితే టీబీకేఎస్ ప్రెసిడెంట్ గా కవితను తప్పించిన వెంటనే గౌరవ అధ్యక్షురాలిగా ఆమెను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు హెచ్ఎంఎస్ ముందుకు రావడం ఆసక్తిని రేపుతోంది. కవిత ఆ ప్రతిపాదనను అంగీకరిస్తే ఇక కవిత వర్సెస్ కేటీఆర్ మధ్య ఆధిపత్యపోరు మరింత ముదరడం ఖాయమంటున్నారు. తనను పదవి నుంచి తప్పించిన కేటీఆర్పై కవిత మరో సంస్థ ద్వారా రివేంజ్ తీసుకోబోతున్నారనే టాక్ నడుస్తోంది.
Also Read: అమెరికాతో ఢీ అంటే ఢీ.. ట్రంప్ సుంకాల్ని వెనుక వ్యూహమేంటి?
సెప్టెంబరు 1న అమెరికా నుంచి తిరిగి రానున్న కవిత
ప్రస్తుతం కవిత అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటన ముగించుకుని సెప్టెంబర్ 1న ఆమె తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. గతంలో కవిత అమెరికా పర్యటనలో ఉండగానే ఆమె కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయింది. అది తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఈసారి అమెరికాలో ఉన్న సమయంలోనే టీబీకేఎస్ పదవి నుంచి తప్పించడం సెన్సేషనల్ గా మారింది. దీంతో ఈసారి అమెరికా నుంచి కవిత తిరిగి వచ్చాక బీఆర్ఎస్లో బిగ్ బ్లాస్ట్ ఉండబోతున్నదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే గులాబీ పార్టీతో సంబంధం లేకుండా తెలంగాణ జాగృతి పేరుతో కవిత సొంత అజెండా నడిపిస్తూ కార్యకలాపాలు విస్తృతం చేస్తున్నారు కవిత. ఆ క్రమంలో తాజా పరిణామాటలపై తీవ్ర స్థాయిలో రగిలిపోతున్న కవిత ఈ సారి ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది గులాబీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోందట.
Story By Ajay Kumar, Bigtv