Cyber Crime: స్వేచ్చ బ్యూరో: ఏటా వందల కోట్లు కొల్లగొడుతున్న సైబర్ క్రిమినల్స్ కు చెక్ పెట్టేందుకు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విస్తృత స్థాయిలో చర్యలకు శ్రీకారం చుట్టింది. ఆపరేషన్ క్రాక్ డౌన్ పేరుతో సైబర్ కేటుగాళ్లకు బ్యాంక్ అకౌంట్లు సమకూర్చటంతోపాటు ఇతరత్రా సాయం చేస్తున్న వారిని అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారు. కటకటాల వెనక్కి పంపిస్తున్నారు. జనంలోని దురాశ, భయాన్ని అవకాశంగా చేసుకుంటున్న సైబర్ క్రిమినల్స్ ప్రతీ సంవత్సరం వందల కోట్ల రూపాయల మోసాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ నేరాల్లోని నిందితుల్లో సింహ భాగం విదేశాల్లో ఉంటూ నేరాలు సాగిస్తుండటం. కొంతమందికి కమీషన్లు ఇచ్చి ఏజెంట్లుగా పెట్టుకుంటున్న ఈ కేటుగాళ్లు వారి ద్వారా వేర్వేరు వ్యక్తుల అకౌంట్లను అద్దెకు తీసుకుంటున్నారు. ఇలా ఖాతాలు సమకూర్చిన వారికి కూడా కమీషన్లు చెల్లిస్తున్నారు. కొల్లగొట్టిన డబ్బును మొదట ఈ ఖాతాల్లో జమ చేయించి ఆ తరువాత క్రిప్టో కరెన్సీ రూపంలో తరలించుకు పోతున్నారు.
ఈ నెట్ వర్క్ ను నిర్వీర్యం చేసే లక్ష్యంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ ఆపరేషన క్రాక డౌన్ 10ను ప్రారంభించారు. దీంట్లో భాగంగా ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా 512మంది సిబ్బందితో 137 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి 137 బ్యాంకుల్లో ఆకస్మిక తనిఖీలు జరిపించారు. దీంట్లో దేశవ్యాప్తంగా దాదాపు 9,451 నేరాలతో సంబంధం ఉండి.. వంద కోట్ల రూపాయలు దారి మళ్లి పోవటానికి కారణమైన 1,888 మ్యూల్ అకౌంట్లను అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో 549 ఎఫ్ఐఆర్ లను నమోదు చేసి 626మంది అనుమానితులను నిందితులుగా పేర్కొన్నారు. వీరిలో 208మందిని అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ అయిన వారిలో 15మంది మహిళలు, 7గురు విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, విద్యుత్ శాఖ ఉద్యోగి, సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ఉండటం గమనార్హం. వీళ్లు తమ తమ ఖాతాలను సైబర్ క్రిమినల్స్ కు అద్దెకు ఇచ్చి ప్రతీ లావాదేవీపై 5శాతం కమీషన్ గా తీసుకున్నట్టు విచారణలో వెల్లడైంది.
Also Read: Telangana News: రాష్ట్రంలో మహిళలకు ఉహించని గుడ్ న్యూస్.. సర్కార్ మరో సంచలన నిర్ణయం..?
అరెస్ట్ అయిన నిందితుల నుంచి 63 మొబైల్ ఫోన్లు, 208 బ్యాంక్ పాస్ బుక్కులు, చెక్ బుక్కులను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మర్చంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ జూబ్లీహిల్స్ శాఖకు చెందిన ఇద్దరు ఉద్యోగులు నిబంధనలకు విరుద్ధంగా ఖాతాలు తెరవడంలో నిందితులకు సహకరించి పట్టుబడటం గమనార్హం. వరంగల్లో ఓ నిందితుడు తన కుటుంబ సభ్యుల ఖాతాలనే సైబర్ క్రిమినల్స్ కు అద్దెకు ఇచ్చాడు. పట్టుబడ్డ నిందితులపై వ్యవస్థీకృ నేరాలను నిరోధించేందుకు ఉద్దేశించిన బీఎన్ఎస్ సెక్షన్ 112 ప్రకారం అధికారులు కేసులు నమోదు చేశారు. ఖాతాలు తెరవడానికి సహకరిస్తున్న ఫెసిలిటేటర్లు, సిమ్ కార్డులు సమకూర్చేవారు, ఏటీఎం వివరాలు సేకరించేవారిపై కూడా అధికారులు నిఘా పెట్టారు. సైబర్ నేరగాళ్ల మౌలిక సదుపాయాలను నిర్వీర్యం చేయడమే తమ లక్ష్యమని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ చెప్పారు. బ్యాంక్ ఖాతాలు, ఏటీఎం కార్డులు, ఓటీపీ వంటి వ్యక్తిగత వివరాలను ఎవ్వరు కూడా ఇతరులతో పంచుకోవద్దని చెప్పారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడి ఆ పని చేస్తే కటకటాల వెనక్కి వెళ్లటం ఖాయమని హెచ్చరించారు.