Bhatti Vikramarka: సింగరేణి సంస్థకు కేటాయించిన ఒడిశాలోని నైనీ కోల్ బ్లాక్ పిట్ హెడ్ వద్ద థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు.. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాంజీతో గురువారం హైదరాబాద్లోని బేగంపేటలో గల ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నైనీ బొగ్గు గని వద్దే థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే రవాణా ఖర్చులు తగ్గడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి వ్యయం కూడా తగ్గుతుందని, దీనికి సంబంధించిన సాధ్యసాధ్యాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారుల ప్రత్యేక బృందం త్వరలోనే నైనీ ప్రాంతాన్ని సందర్శిస్తుందని ఒడిశా సీఎంకు వివరించారు.
సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్ బ్లాక్ వద్ద క్షేత్రస్థాయి పరిస్థితులు, నీటి లభ్యత, పర్యావరణ అనుమతులు వంటి అంశాలపై అధికారుల బృందం అధ్యయనం చేసి అంచనాలను రూపొందిస్తుందని భట్టి తెలిపారు. ఆ బృందం ఇచ్చే నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ప్లాంట్ ఏర్పాటుపై తదుపరి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన పట్ల ఒడిశా సీఎం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ విట్టల్, సింగరేణి సీఎండీ కృష్ణ భాస్కర్, సింగరేణి డైరెక్టర్లు/అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.