Damodara Raja Narasimha: ఇన్ఫర్టిలిటీ సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తూ, ఎన్నో జంటల మాతృత్వపు కలలను సాకారం చేస్తున్న గాంధీ, పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్ల డాక్టర్లు, సిబ్బందికి అభినందనలు అంటూ వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. ఆయన వెంగళరావు నగర్ లోని ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2024 అక్టోబర్లో గాంధీ ఐవీఎఫ్ సెంటర్, డిసెంబర్లో పెట్లబుర్జు ఐవీఎఫ్ సెంటర్లో ఫర్టిలిటీ వైద్య సేవలు ప్రారంభించుకున్నామన్నారు. ఇప్పటివరకు సుమారు 27,300 మంది ఈ రెండు సెంటర్ల ద్వారా ఫర్టిలిటీ వైద్య సేవలు పొందారన్నారు.పెరిగిన ఇన్ఫర్టిలిటీ సమస్యకు ఈ నంబర్లు అద్దం పడుతున్నాయన్నారు. అందుకే మరింత బాధ్యతాయుతంగా అందరం పనిచేయాల్సిన అవసరం ఉన్నదన్నారు.మాతృత్వపు కలను సాకారం చేసుకునేందుకు, ప్రైవేట్ ఐవీఎఫ్ సెంటర్లకు వెళ్ళి ఆర్థికంగా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండకూడదన్నారు. ఈనేపథ్యంలోనే వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను త్వరలో ప్రారంభించబోతున్నామన్నారు. అక్కడ ఒక ఐవీఎఫ్ సెంటర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీంతో పాటు అదిలాబాద్ రిమ్స్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లోనూ ఐవీఎఫ్ సెంటర్లను ప్రారంభించాలని నిర్ణయించామన్నారు. ప్రభుత్వం బిల్డింగులు కట్టి సౌకర్యాలు కల్పించి, డాక్టర్లు-సిబ్బందిని రిక్రూట్ చేసినా, అక్కడ వైద్య సేవలు అందించాల్సింది స్టాఫ్ అంటే వివరించారు.
ఇక డాక్టర్లు అడిగినట్టుగా ప్రమోషన్లు ఇస్తున్నామని, కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. టీవీవీపీని డైరెక్టరేట్గా మార్చామన్నారు. ఈ క్రమంలో మరింత బాధ్యత ప్రదర్శించాలన్నారు. విధులకు గైర్హాజరవడాన్ని, నిర్లక్షంగా ఉండడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదన్నారు. కొన్ని హాస్పిటళ్లలో అటెండెన్స్ తక్కువగా ఉన్నదని, ఈ పరిస్థితి అస్సలు ఉండకూడదని మంత్రి నొక్కి చెప్పారు. డీఎంహెచ్వోలు, డీసీహెచ్లు, సూపరింటెండెంట్లు సీరియస్గా పని చేయాలన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, ఆకస్మిక తనిఖీలు చేసి, నిర్లక్షం వహించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ డాక్టర్లు, సిబ్బంది మీద తనకు సంపూర్ణంగా నమ్మకం ఉన్నదని మంత్రి వివరించారు. అందరం సమిష్టిగా కృషి చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సంగీత సత్యనారాయణ, ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, డీఎంఈ నరేంద్ర కుమార్, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ రవీంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో ఐవీఎఫ్ చేయించుకున్న మహిళ, ఇటీవలే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.రాష్ట్రంలో ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల ద్వారా జన్మించిన తొలి శిశువుగా, పాప పుట్టుకతోనే కొత్త రికార్డు సృష్టించింది.ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో జరిగిన ఓ కార్యక్రమంలో గాంధీ హాస్పిటల్ ఐవీఎఫ్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందిని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఐవీఎఫ్ సెంటర్ హెడ్, డాక్టర్ శోభ, ప్రోగ్రామ్ ఆఫీసర్, డాక్టర్ సుమిత్ర నాయర్, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఫాతిమా రాణి, ఎంబ్రయాలజిస్ట్ శివకృష్ణ, నర్సింగ్ ఆఫీసర్ పద్మావతి తదితరులను మంత్రి ఘనంగా సత్కరించి, వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.
Also Read: Nizamabad Politics: నిజామాబాద్ జిల్లా బాన్సువాడను మై చోడీధీయ.. అంటున్న మాజీ ఎంఎల్ఏ..?