Farmer DISCOM: స్వేచ్ఛ బ్యూరో: రైతు డిస్కం రైతుల పాలిట మరణశాసనమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అప్పులతో పుట్టిన డిస్కంకు సేవలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని దుస్సాహసాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, రైతు డిస్కంను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి రైతులను కష్టాల్లోకి నెడుతోందని మండిపడ్డారు. తెలంగాణ ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో రైతు డిస్కం-ప్రకటిత లక్ష్యాలు-ఆచరణ సవాళ్లు అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు మాధవరెడ్డి, ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. కాగా ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై మాట్లాడారు.
రైతు డిస్కం ఏర్పాటు విషయం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు ఏమాత్రం అవగాహన లేదని పేర్కొన్నారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కొత్త డిస్కం ఏర్పాటుకు తెలంగాణ రాష్ట్ర ఈఆర్సీ నుంచి అనుమతులు లేక ముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ 2న ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడం శోచనీయమన్నారు. గతంలో తమ పాలనలో రైతుల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే తాము అడ్డుకున్నామని, శాసనసభ ఏర్పాటు చేసి తీర్మాణం చేసి కేంద్రానికి పంపించామని, దాని ఫలితంగా కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన రూ.23 వేల కోట్ల అప్పులను రాకుండా అడ్డుకుందని మండిపడ్డారు. కానీ ప్రభుత్వం ఎవరి అభిప్రాయం లేకుండానే ఏక పక్షంగా మూడో డిస్కం ఏర్పాటు చేసి రైతులను నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తుందని ఆరోపించారు.
తమ పాలనలో రూ.60 వేల కోట్లతో 400 కేవీ సబ్స్టేషన్లు 30, 220 కేవీ సబ్స్టేషన్లు 52, 132 కేవీ సబ్స్టేషన్లు 175కు పెంచామని మాజీ మంత్రి గుర్తుచేశారు. అలాగే 16 వేల కిలోమీటర్లు ఉన్న లైన్ను 28 వేల కిలోమీటర్లకు పెంచామన్నారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండున్నరేండ్లలో ఒక్క సబ్స్టేషన్ నిర్మాణం జరగలేదని విమర్శించారు. రైతు డిస్కమ్కు థర్మల్ పవర్ను కేటాయించడం దుర్మార్గమన్నారు. ఈనెల 29న ఈఆర్సీ బహిరంగ విచారణకు తాము వస్తామని, బలమైన వాదనలు వినిపించి రైతుల పాలిట శాపంగా మారనున్న కొత్త డిస్కంను అడ్డుకుంటామన్నారు.
Also Read: రాష్ట్రంలో జూన్ నెల నుంచి సర్కార్ జెట్ స్పీడ్.. ఆ అంశాలపై స్పెషల్ ఫోకస్..?
ఇదిలాఉండగా ప్రస్తుతం ఉద్యోగుల విభజన తీరు గమనిస్తే సుమారుగా 600 డీటీఆర్లను ఒకరు చూడాలంటే సాధ్యమా అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. నాలుగు డీటీఆర్లు ఒకేసారి కాలిపోయినా, సమస్య వచ్చినా దానిని సదరు ఉద్యోగి పరిశీలించడానికి కనీసం నాలుగు రోజులు పడుతుందని, అంత వరకు రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటి వరకు మండలానికి 10-15 మంది సిబ్బంది ఉంటేనే ఇబ్బందులు ఎదురయ్యాయని, అలాంటిది ఒక్కరికి 600 కు పైగా డీటీఆర్ల నిర్వహణ అసాధ్యమని అన్నారు. ఈ అంశంపై కనీసం అసెంబ్లీలో కూడా చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకోవడమేంటని ధ్వజమెత్తారు.
ఎలక్ట్రికల్ రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మాధవరెడ్డి మాట్లాడుతూ.. తమకు సరైన సేవలు అందడంలేదని ఎవరూ అడగలేదని, థర్డ్ డిస్కం ఏర్పాటు పూర్తిగా ఏక పక్ష నిర్ణయమని విమర్శించారు. సంఘం ప్రధాన కార్యదర్శి తుల్జారాంసింగ్ మాట్లాడుతూ.. కొత్త డిస్కం ఏర్పాటుతో మళ్లీ తెలంగాణలో పాత రోజులు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వం ప్రజల, వినియోగదారుల శ్రేయస్సు కోరి థర్డ్ డిస్కం ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకోవాలని సూచించారు. ఏపీఎస్ఈబీలో పనిచేసిన ఇంజనీర్స్ అసోసియేషన్ మాజీ ప్రధాన కార్యదర్శి వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. మూడో డిస్కమ్ ఏర్పాటు అవసరం లేదని, రెండు డిస్కంలతో 12 సంవత్సరాలుగా వినియోగదారులకు మంచి సేవలు అందుతున్నాయని తెలిపారు.
మూడో డిస్కంతో అప్పులు పెంచడమే తప్ప ఏలాంటి ప్రయోజనం లేదన్నారు. టీఈఈఏ మాజీ ప్రధాన కార్యదర్శి రామేశ్వరయ్య శెట్టి మాట్లాడుతూ.. థర్డ్ డిస్కం ప్రభుత్వంతో పాటు ఏవర్గానికీ ఉపయోగపడతని తెలిపారు. అనంతరం రైతుసంఘం నాయకుడు శ్రీధర్రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిస్కం అంటే వ్యాపారమని, అంతా ప్రభుత్వమే చూస్తున్నప్పుడు రైతు డిపార్ట్మెంట్ అని పేరు పెట్టి ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. సీపీఐ(ఎం) సహ కార్యదర్శి తీగల సాగర్ మాట్లాడుతూ.. కొత్త డిస్కం ఏర్పాటు వెనుక కుట్ర దాగి ఉందన్నారు. ప్రభుత్వానికి రైతులపై నిజమైన ప్రేమ ఉంటే తక్కువ ఖర్చుతో వచ్చే విద్యుత్ కేటాయించేదన్నారు. కానీ అధిక ధరతో వచ్చే థర్మల్ విద్యుత్ను కేటాయించడం వెనుక సంస్థను నిర్వీర్యం చేసే కుట్ర దాగి ఉందని విమర్శింన్నారు. ఒక్కపైసా వంతు ఉపయోగపడని రైతు డిస్కంకు రూ.1300 కోట్ల ఖర్చుతో మీటర్ల బిగింపు వృథా అని పేర్కొన్నారు. ఇది కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడుతుందన్నారు.
Also read: పాలమూరును కేసీఆర్ మోసం చేశాడు.. మేం న్యాయం చేస్తాం- మంత్రి వాకిటి శ్రీహరి
అనంతరం అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకుడు కోటేశ్వర్రావు మాట్లాడుతూ.. ఇది రైతు డిస్కం కాదని, డబ్బులు లేని డిస్కమని విమర్శించారు. ఇది రూ.35 వేల కోట్ల అప్పుతో పుడుతోందన్నారు. ఆదాయం లేని డిస్కంకు స్మార్ట్ మీటర్లు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు డిస్కం ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. 1104 ట్రేడ్ యూనియన్ మాజీ కార్యదర్శి జనార్ధన్రెడ్డి మాట్లాడుతూ.. రైతు డిస్కమ్ ఏర్పాటు ఏక పక్ష నిర్ణయమని, 30 శాతం స్టేక్ హోల్డర్స్ అయిన ఉద్యోగులతో కూడా చర్చించకుండానే డిస్కం ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. ఎనర్జీ సెక్రటరీ, రైతు డిస్కం సీఎండీల ఒంటెత్తు పోకడలతో ఏకపక్షంగా ముందకు వెళ్తున్నారని విమర్శించారు.
టీఈఈఏ అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ.. రైతు డిస్కం వాటా 42 శాతం ప్రకారం ప్రతి ఏటా రూ.32 వేల కోట్ల విద్యుత్ కావాలని, ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న క్రాస్ సబ్సిడీ కేవలం రూ.16 వేల కోట్లు అని తెలిపారు. మరి ఇంకా రూ.16 వేల కోట్లు ఎలా సర్దుబాటు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడిగా ప్రస్తుతం క్రాస్ సబ్సిడీ వచ్చే దాదాపు రూ.10 వేల కోట్ల నిధులను రైతులకు డైవర్షన్ జరిగేదన్నారు. 6 లక్షల ట్రాన్స్ఫార్మర్లను వెయ్యి మంది సిబ్బంది ఎలా నిర్వహిస్తారని, దీనికి యాజమాన్యాలు సమాధానం చెప్పాలన్నారు. స్ట్రక్చర్ పూర్తి చేయకుండానే ఆగమేఘాల మీద డిస్కం ఏర్పాటు చేయడం అనర్థాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. రైతు డిస్కంకు లైసెన్స్ ఇవ్వకూడదనే నాలుగు తీర్మానాలను తెలంగాణ ఈఆర్సీకి అందజేయాలని నిర్ణయించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సత్యనారాయణరావు(1104), జెన్కో ఏడీఈ కృష్ణ, ప్రవీణ్కుమార్, ఎస్ఎల్ పద్మ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: Women Empowerment: తెలంగాణలో నేటి నుంచి మహిళా వారోత్సవాలు