GHMC News: ఎట్టకేలకు జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ వ్యవహారం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ డీలిమిటేషన్కు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో డివిజన్లు, జోన్లు, సర్కిళ్లు రెట్టింపు కానున్నాయి. కొత్తగా ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, శంషాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్ జోన్లుగా ఏర్పడ్డాయి.
జీహెచ్ఎంసీలో జోన్లు-సర్కిల్స్-పెంపు
డిసెంబర్ చివరినాటికి జీహెచ్ఎంసీ డీలిమిటేషన్ పూర్తి అయ్యింది తెలంగాణ ప్రభుత్వం. దీంతో హైదరాబాద్ మహానగర పాలక సంస్థ స్వరూపం మారిపోయింది. ఈ నేపథ్యంలో వార్డుల పునర్విభజన ప్రక్రియకు ఫైనల్గా ఆమోదముద్ర వేసింది తెలంగాణ ప్రభుత్వం. చివరకు నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 వార్డులు ఉన్నాయి.
ఆ సంఖ్య 300కి పెంచింది. ఈ మేరకు పురపాలక పరిపాలన-పట్టణాభివృద్ధి శాఖ గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. దీంతో ఔటర్ రింగ్ రోడ్డు వరకు జీహెచ్ఎంసీ పరిధి విస్తరించింది. ఈ విలీనంతో జీహెచ్ఎంసీ విస్తీర్ణం దాదాపు 2,050 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. జనాభా దాదాపు కోటిన్నరకు చేరినట్టు అధికారుల అంచనా.
దేశంలో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించింది జీహెచ్ఎంసీ. దీనికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మార్చిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగడం ఖాయం. డిసెంబర్ 9న జీహెచ్ఎంసీ డివిజన్ల డీలిమిటేషన్కు సంబంధించి తొలి నోటిఫికేషన్ ఇచ్చింది ప్రభుత్వం.
రానున్న అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు
దాదాపు ఆరు వేలకు పైగా అభ్యంతరాలు రావడం, వాటిని పరిగణలోకి తీసుకోవడం చకచకా జరిగిపోయింది. సోమవారం నుంచి కొత్త జోన్ కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. సర్కిల్ ఆఫీసులలో కొత్త జోన్ కార్యాలయాలు, వార్డు ఆఫీసులలో నూతన సర్కిల్ కార్యాలయాల్లో పరిపాలన మొదలుకానుంది.
తాజా గెజిట్ నోటిఫికేషన్తో కొత్తగా ఏర్పడిన 300 వార్డులకు ఓటర్ల జాబితాను కేటాయించే ప్రక్రియ మొదలుకానుంది. పాలన కోసం ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లను 12కు పెరగనుంది. అలాగే 30 సర్కిళ్లను 60 కి పెంచే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇదిలాఉండగా జీహెచ్ఎంసీలో కొత్తగా ఏర్పాటైన జోన్లకు కమిషనర్లను నియమించింది ప్రభుత్వం.
12 జోన్లకు కమిషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, ఖైరతాబాద్, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, మల్కాజ్గిరి, ఉప్పల్, చార్మినార్, సికింద్రాబాద్, గోల్కొండ, శంషాబాద్లు ఉన్నాయి. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో పలువురు మంత్రులు గ్రేటర్ని ఎన్ని కార్పొరేషన్లు చేస్తున్నారని చర్చించారట.
ALSO READ: రైతులకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి రైతు భరోసా
ప్రస్తుతం జీహెచ్ఎంసీ పాలక మండలి ఫిబ్రవరి 10 వరకు గడువు ఉందని, ఆ తర్వాత ఎన్ని కార్పొరేషన్లు అన్నదానిపై చర్చిద్దామని చెప్పడంతో సైలెంట్ అయినట్టు తెలుస్తోంది. అప్పటివరకు ఒక్క కార్పొరేషన్గా ఉండనుంది. ఆ తర్వాత స్పెషల్ అధికారుల పాలనలోకి వెళ్లనుంది. అప్పుడు ఎన్ని కార్పొరేషన్లు చేస్తున్నారనే అంశం ఓ కొలిక్కిరానుంది.