Hyderabad News: హైదరాబాద్ సిటీ మహా నగరంగా విస్తరించింది. దేశంలోనే అతి పెద్ద సిటీగా మారింది. 27 మున్సిపాల్టీలు విలీనం తర్వాత జీహెచ్ఎంసీ పరిధి పెరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే గ్లోబల్ సిటీగా మారిపోయింది. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో సిటీ పరిధి 1,800 నుంచి 2,700 చదరపు కిలోమీటర్లకు పెరిగింది.
ఇకపై హైదరాబాద్ మహానగరం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణ ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. హైదరాబాద్ శివారులోని మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలన్న మంత్రివర్గం నిర్ణయానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగర పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మంగళవారం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో విలీనమైన మున్సిపాలిటీలు-కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వాటి బాధ్యతలను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. విలీనమైన మున్సిపాలిటీలు ఏ జోన్లో భాగం అవుతాయి, ఏ అధికారి బాధ్యత వహించాలి అనేది స్పష్టంగా పేర్కొంది.
విలీనమైన ప్రాంతాలు ఐదు జోన్లుగా ఏర్పాటు
చార్మినార్ జోన్లోని ఆదిభట్ల, బడంగ్ పేట్, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్ ప్రాంతాలు రానున్నాయి. అలాగే శేరిలింగంపల్లి జోన్ లోకి బండ్లగూడ జాగీర్, మణికొండ, నార్సింగి, అమీన్ పూర్, తెల్లాపూర్ ఉండనున్నాయి. ఇక ఎల్బీ నగర్ జోన్లోని మీర్ పేట్, పెద్ద అంబర్ పేట, తుక్కుగూడ, దమ్మాయిగూడ, ఘట్ కేసర్, పీర్జాదిగూడ, పోచారం మున్సిపాలిటీలు వెళ్లనున్నాయి.
సికింద్రాబాద్ జోన్ లోకి బోడుప్పల్, జవహర్ నగర్, నాగారం, తూంకుంట వంటి ప్రాంతాలు ఉండనున్నాయి. చివరిగా కూకట్పల్లి జోన్లోని దుండిగల్, గుండ్లపోచంపల్లి, కొంపల్లి, మేడ్చల్, నిజాంపేట్, బొల్లారం వంటి ప్రాంతాలు ఉండనున్నాయి. ప్రస్తుతమున్న మున్సిపాలిటీల కమిషనర్లు.. డిప్యూటీ కమిషనర్లుగా వ్యవహరించనున్నారు. అవన్నీ బల్దియా సర్కిళ్ల పరిధిలోకి వచ్చాయి.
ALSO READ: 73 లక్షలతో సర్పంచ్ అవ్వాలనుకున్న అభ్యర్థికి ట్విస్ట్
ఇందులో భాగంగా గతంలో ULBలు ఉపయోగించిన అన్ని భవనాలపై జీహెచ్ఎంసీ నేమ్ బోర్డులను ఏర్పాటు చేస్తుంది. 27 ULBలకు సంబంధించిన రికార్డులను డిప్యూటీ కమిషనర్లు స్వాధీనం చేసుకోనున్నారు. డిసెంబర్ 5 నాటికి ఆయా డిప్యూటీ కమిషనర్లు నివేదికలను సమర్పించాలని GHMC కమిషనర్ RV కర్ణన్ కోరారు.
GHMC లో కలిసిన 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు జోన్లు కేటాయింపు pic.twitter.com/be713W78zg
— BIG TV Breaking News (@bigtvtelugu) December 4, 2025