TVVP Commissioner: స్వేచ్చ బ్యూరో: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఇన్ చార్జ్ కమిషనర్ ను ఎవర్ని నియమించాలి? అని సర్కార్ తర్జన భర్జన పడుతున్నది. టీవీవీపీ బాస్ కుర్చీ కోసం ఇప్పటికే సీనియర్లు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా, ఇన్ చార్జ్ హోదా కావడంతో ఆసక్తిగల జూనియర్లు తమదైన శైలీలో ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు కొంత కాలం పాటు ఐఏఎస్ లకు ఇన్ చార్జ్ బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుండగా, సీనియారిటీని బేస్ చేసుకొని డాక్టర్లకే ఈ సీటును కేటాయించాలని డాక్టర్ల అసోసియేషన్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.పైగా గతంలో ఐఏఎస్ కు బాధ్యతలు ఇవ్వడంతో కోర్టు కేసులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో టీవీవీపీ బాస్ కుర్చీని ఎవరికి కేటాయించాలో అర్థం కాక ఉన్నతాధికారులు కూడా సతమతమవుతున్నారు. ఎవరికి బాధ్యతలు ఇచ్చినా..కాంప్లికేటెడ్ లేకుండా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులతో హెల్త్ మినిస్టర్ తాజాగా రివ్యూ కూడా నిర్వహించారు. సీనియారిటీ జాబితా, ఆయా డాక్టర్ల సర్వీస్ హిస్టరీ తదితర అంశాలపై స్టడీ చేసినట్లు తెలిసింది.
తెలంగాణ వైద్య విధాన ఇన్ చార్జ్ కమిషనర్ డాక్టర్ అజయ్ కుమార్ పదవీ కాలం ఈ రోజు(శనివారం) తో ముగియనున్నది. 5 ఏప్రిల్ 2022 న ఇంచార్జి కమిషనర్గా ఆయన బాధ్యతలు స్వీకరించి, సుదీర్ఘకాలం పాటుఈ పదవిలో కొనసాగారు. బీఆర్ ఎస్ ప్రభుత్వ హయంలో కామారెడ్డి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న డాక్టర్ అజయ్ కుమార్ ‘సౌమ్యుడు’ అనే మంచి పేరు కారణంగా, ఈ కీలక పోస్టుకు ఎంపిక చేశారు. తొలుత జాయింట్ కమిషనర్ బాధ్యతలు ఇచ్చి, ఆ తర్వాత ఇంచార్జి కమిషనర్గా అవకాశం కల్పించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలోని కీలక విభాగాధిపతులను మార్చినప్పటికీ, అజయ్ కుమార్ కు లెప్ట్ ఓవర్ సర్వీస్ ఉన్న నేపథ్యంలో కంటిన్యూ చేశారు. ఇక ఇప్పుడు టీవీవీపీ డైరెక్టరేట్ గానూ కన్వర్ట్ అయింది. ఈ పరిస్థితుల్లో ఆ కుర్చీని భర్తీ చేయడం ప్రభుత్వానికి టాస్క్ గా మారింది.
Also Read: 15 ఏళ్ల వైభవ్ ను బెదిరించిన రియాన్ పరాగ్..ఎందుకురా నీకు ఇంత బిల్డప్ అంటూ!
వాస్తవానికి టీవీవీపీలో గత కొంతకాలంగా పదోన్నతులు చేపట్టకపోవడం పెద్ద సమస్యగా మారింది. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు రెండు జాయింట్ కమిషనర్ పోస్టులను పదోన్నతిపై భర్తీ చేయలేదు.కేవలం ఇంచార్జిలతోనే కాలం వెళ్లదీస్తున్నారు.ఈ నేపథ్యంల అజయ్ కుమార్ తర్వాత ఆ పోస్టులో ఎవరిని కుర్చోపెట్టాలో తెలియని అయోమయం పరిస్థితి ప్రభుత్వంలో ఉన్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీవీవీపీ పరిధిలో 184 ఆసుపత్రులు ఉండగా, దాదాపు 10,454 మంది పనిచేస్తున్నారు. ఇంత పెద్ద విభాగానికి పూర్తి స్థాయిలో అధిపతి లేకపోవడం గమనార్హం. ఇక డైరెక్టర్ గా మార్చినట్లు ఇప్పటి వరకు పూర్తిస్థాయి మార్గదర్శకాలు విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో ఇన్ చార్జ్ కమిషనర్ గా బాధ్యతలు ఇచ్చి నెట్టుకువచ్చే అవకాశం ఉన్నదని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
మరోవైపు టీవీవీపీ తదుపరి ఇంచార్జి కమిషనర్ ఎవరనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా వైద్యశాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయానికి (సీఎంవో) సంబంధిత ఫైల్ను పంపింది. అయితే ప్రస్తుతం బదిలీల ప్రక్రియ నడుస్తుండటంతో, జూన్ మొదటి వారం వరకు దీనిపై ఎటువంటి నిర్ణయం రాకపోవచ్చని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఖాళీ అయిన మరుక్షణమే మరోక అధికారికి బాధ్యతలు ఇవ్వాలని ప్రభుత్వ సర్వీస్ రూల్ ఉన్నది. దీంతో ఎంపిక ఆసక్తిగా మారింది. మరోవైపు ఈ పోస్టులో కూర్చోవాలంటే సీనియారిటీ జాబితాలోని వైద్యులకు పదవీ విరమణకు కనీసం రెండేళ్ల సమయం ఉండాలి. అంతేగాక టీవీవీపీ యాక్ట్ ప్రకారం హెడ్ ఆఫీస్ లో పాలనా అనుభవం కూడా ఉండాలి. అంటే జాయింట్ కమిషనర్ గా పనిచేసి ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం కమిషనర్ గా ఎవరిని ఎంపిక చేస్తుందోనని వైద్యవర్గాల్లో ఆసక్తి నెలకొన్నది.
Also read: మంత్రి తుమ్మలకు వయసు మీరింది.. ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!