Rajiv Yuva Vikasam Scheme: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూపులు చూస్తున్న పథకానికి టైమ్ దగ్గర పడింది. ఆరోజు కోసమే ఎందరో వేచి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సిఎం రేవంత్ సర్కార్, ఆ చల్లని కబురు చెప్పింది. దీనితో ఆ స్కీమ్ ద్వారా లబ్ది పొందే లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యువతను బిగ్ బిజినెస్ మ్యాన్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. మరి ఆ స్కీమ్ ఏంటి? కలిగే లబ్ది ఏంటి? పూర్తి విషయాలు తెలుసుకుందాం.
స్కీమ్ ముహూర్తం ఆ రోజే ఎందుకు?
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరో గొప్ప పథకానికి శ్రీకారం చుడుతోంది. ఎన్నో కలలు కని, వ్యాపార ఆలోచనలు ఉన్నా పెట్టుబడి తక్కువగా ఉండటంతో వెనుకబడిపోయిన లక్షలాది యువతకు ఆసరాగా మారబోతోంది రాజీవ్ యువ వికాసం పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల మంది యువతకు ఆత్మనిర్భరత దిశగా మెరుగైన అవకాశాలు కలగనున్నాయి.
స్పందన అదుర్స్..
ఈ పథకానికి భారీ స్పందన లభించింది. ఇప్పటికే 16.22 లక్షల మంది యువతీ, యువకులు దరఖాస్తులు చేశారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు ఉన్నారు. వారి కలలకు బాసటగా, పథకం ప్రారంభ దశలోనే రూ. 6,250 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. జూన్ 2న తొలి విడతగా రూ. లక్ష లోపు యూనిట్లకు ప్రొసీడింగ్లు ఇవ్వనున్నారు.
సబ్సీడీ వివరాలు ఇలా..
రూ.50,000 వరకూ పూర్తిగా (100%), రూ.లక్ష వరకూ 90%, రూ.2 లక్షల వరకూ 80%, రూ.4 లక్షల వరకూ 70% సబ్సీడీతో రుణాలు మంజూరు చేస్తారు.
ఈ వివరాలు తప్పక తెలుసుకోండి
ఈ పథకం క్రమబద్ధంగా అమలు కానుంది. జూన్ 2 నుంచి 9వ తేదీ వరకూ ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. అనంతరం జూన్ 10 నుంచి 15వ తేదీ వరకూ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో భాగంగా ఎంపికైన అభ్యర్థులకు ఎంట్రప్రెన్యూరియల్షిప్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. జూన్ 16 నుంచి యూనిట్ల ప్రారంభోత్సవాల నిర్వహణకు సిద్ధమవుతున్నారు. గాంధీ జయంతి నాటికి అన్ని యూనిట్లు ప్రారంభం కావాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా ప్రారంభం అయ్యే 5 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లు రాష్ట్రానికి భారీగా ఉపాధిని అందించనున్నాయి. ప్రతి యూనిట్ సగటున 4.4 మందికి ఉపాధి కల్పిస్తుందన్న గణాంకాల ప్రకారం, మొత్తం 22 లక్షల ఉద్యోగాలు రాష్ట్రంలో సృష్టించబడతాయని అంచనా. ఇది తెలంగాణ రాష్ట్ర జీఎస్డీపీపై కూడా సానుకూల ప్రభావం చూపనుంది.
Also Read: Tirumala Summer Rush: తిరుమలలో మొదలైన రద్దీ.. ఇలా ప్లాన్ చేసుకోండి.. లేకుంటే?
లబ్ధిదారుల వివరాలు చూస్తే..
ఈ పథకం ఎంత సముచితంగా రూపుదిద్దుకుందో స్పష్టమవుతుంది. మొత్తం లబ్ధిదారుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అభ్యర్థులు 80% వరకు ఉన్నారు. వీరిలో బీసీలు 31.44%, ఎస్సీలు 29.36%, ఎస్టీలు 19.59%. 25% మహిళలకు, 5% దివ్యాంగులకు రిజర్వేషన్లు కల్పించారు. తెలంగాణ ఉద్యమంలో, ఎస్సీ వర్గీకరణ ఉద్యమంలో పాల్గొని అమరులైన కుటుంబాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అవినీతికి తావులేకుండా, పూర్తి పారదర్శకతతో లబ్ధిదారుల ఎంపిక జరగడం ఈ పథకానికి మరింత విశ్వసనీయతను తెచ్చిపెట్టింది.
గతంలో 9.09 లక్షల కార్పొరేషన్ రుణాలు పెండింగ్లో పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుతో తీవ్ర నిరాశకు లోనైన యువతకు ఈ పథకం పెద్ద ఊరటగా మారిందని యువత అంటోంది. అప్పట్లో తిరస్కరించబడిన దరఖాస్తుదారుల్లో చాలామంది ఇప్పుడు రాజీవ్ యువ వికాసం పథకంలో దరఖాస్తు చేసి అవకాశం పొందుతున్నారు. ఈ పథకం విజయవంతంగా అమలైతే, రాబోయే సంవత్సరాల్లో తెలంగాణను స్వయం ఉపాధిలో దేశానికే ఆదర్శంగా నిలిపే అవకాశం ఉంది. యువతలో వ్యాపార భావనను పెంపొందించి, నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇది ఒక విప్లవాత్మక అడుగుగా చెప్పవచ్చు.