Plantation Quality: స్వేచ్ఛ బ్యూరో: ప్రతి ఏటా ప్రభుత్వం వనమహోత్సవంను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. మొక్కలను పెంచే నర్సరీలు, ప్లాంటేషన్ల పనులపై ఫోకస్ పెట్టింది. మొక్కలు నాణ్యతతో ఉండేలా చర్యలు చేపడుతుంది. అధికారులు పర్యటించి అక్కడి పరిస్థితులపై ప్రతి వారం నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నారు. ఎవరైనా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండానే రిపోర్టు ఇస్తే వారిపై సైతం చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఏడాది 10.18కోట్ల మొక్కలు పెంచేందుకు జిల్లాలోని డీఆర్డీఓలు ప్రణాళిక పంపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద నర్సరీలు, ప్లాంటేషన్ల పనులు చేపడుతున్నారు. నర్సరీల్లో క్వాలిటీ మొక్కలు పెంచుతున్నారా?.. ప్లాంటేషన్ పనులు నిబంధనల ప్రకారం చేస్తున్నారా? లేదా అనే దానిపై గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. 2025-26 నాటి పనులతో పాటు 2026-27 సీజన్కు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాలని గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఆ పనుల పర్యవేక్షణకు క్వాలిటీ కంట్రోల్ బృందాలు ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. పనుల నాణ్యతను పరిశీలించి, ప్రతి వారం నివేదికలు అందజేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలిచ్చింది. దీంతో మొక్కల స్థితి గతి, పనుల వివరాలను స్పష్టంగా ప్రభుత్వానికి తెలియనుంది.
ప్రతీ ఏటా ప్రభుత్వం వనమహోత్సవ కార్యక్రమాన్ని జూన్ లేదా జూలై నిర్వహిస్తుంది. ఈ ఏడాది 2026-27 వన మహోత్సవం కార్యక్రమంకు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. 6.18 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,750 గ్రామ పంచాయతీ నర్సరీల్లో ప్రస్తుతం 10.18 కోట్ల మొక్కలను పెంచుతున్నట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటీ, అవెన్యూ ప్లాంటేషన్లతో పాటు ఈత, తాటి, ఉద్యానవన మొక్కలు, పండ్ల మొక్కలు ఇంటింటికీ పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో నాటిన మొక్కల పరిస్థితిని కూడా అధికారులు పరిశీలించనున్నారు. అందుకు సంబంధించిన నివేదికను సైతం అందజేయాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం.
Also Read: పవన్ వర్సెస్ విజయ్.. దళపతి గెలుపు పై ఏపీ ఐటీ సెల్స్ కుల కంపు..!
క్వాలిటీ కంట్రోల్ అధికారులు తనిఖీల సమయంలో అనుసరించాల్సిన చెక్ లిస్ట్ను ప్రభుత్వం విడుదల చేసింది. నర్సరీలో ఎన్ని మొక్కలు ఉన్నాయి? కొత్తగా పెంచినవి ఎన్ని? కవర్ల సైజు మార్పిడి సరిగ్గా జరిగిందా? షేడ్ నెట్, నీటి సౌకర్యం ఉందా? రిజిస్టర్లు అప్డేట్గా ఉన్నాయా? అనేది అధికారులు పరిశీలన చేయనున్నారు. అదే విధంగా ఎన్ని గుంతలు తీశారు? ఎన్ని మొక్కలు నాటారు? వాటిలో ఎన్ని బతికాయి? వాచర్ను నియమించారా? నీళ్లు పోస్తున్నారా? వంటి అంశాలను ప్రతి ప్లాంటేషన్ వద్ద అధికారులు రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పనులకు సంబంధించి ఎస్టిమేషన్ ఎంత? ఇప్పటి వరకు కూలీలకు, మెటీరియల్కు ఎంత ఖర్చు చేశారు? అనే వివరాలను సరిపోల్చనున్నారు.
జిల్లాల్లో పర్యటించే అధికారులు నర్సరీలు, ప్లాంటేషన్ల నాణ్యతను పరిశీలించి ప్రతి వారం ఉన్నతాధికారులకు రిపోర్ట్ పంపాల్సి ఉంటుంది. నర్సరీల వారీగా మొక్కల వివరాలు అందజేయనున్నారు. ఈ తనిఖీల ప్రక్రియను పర్యవేక్షించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. గతంలో నర్సరీల్లో నాణ్యమైన మొక్కలు పెంచకపోవడం, గుంతలు సరిగ్గా తీయకపోవడంతోనే మొక్కలు నాటిన కొద్దిరోజులకే ఎండిపోవడం(చనిపోవడం)జరిగింది. నిధులు ఖర్చు అవుతున్నా ప్రభుత్వ లక్ష్యం నెరవేరకపోకపోవడంతో ప్రభుత్వం నర్సరీలు, ప్లాంటేషన్ పై ఫోకస్ పెట్టినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: ఐపీఎల్ కోసం పాకిస్తాన్ ను బలి పశువు చేస్తారా ? ఆస్ట్రేలియా B టీమ్ ను పంపడంపై తన్వీర్ సీరియస్