తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఎల్అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలని కేబినెట్ తీర్మానించింది. ఈ స్వాధీన ప్రక్రియను పర్యవేక్షించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉన్నతస్థాయి మంత్రి వర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు సభ్యులుగా ఉండి విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
గత ఏడాది కుదిరిన ప్రాథమిక ఒప్పందం ప్రకారం.. ఎల్ అండ్ టీ సంస్థకు రూ.2 వేల కోట్ల ఈక్విటీని ప్రభుత్వం ఏకమొత్తంగా చెల్లించనుంది. దీంతో పాటు ప్రాజెక్టుపై ఉన్న సుమారు రూ.13 వేల కోట్ల రుణ భారాన్ని సైతం ప్రభుత్వం తన ఖాతాలోకి బదలాయించుకునేలా అవగాహన కుదిరింది. ఈ ఒప్పందం తర్వాతే స్వాధీన ప్రక్రియ వేగవంతమైంది. మెట్రో ఆస్తుల విలువను ఐడీబీఐ క్యాపిటల్ మదింపు చేయగా.. రైళ్లు, ట్రాక్లు, సిగ్నలింగ్ వంటి సాంకేతిక అంశాలపై ఢిల్లీ మెట్రో రైలు సంస్థ (DMRC) ఇప్పటికే ప్రాథమిక నివేదికలను ప్రభుత్వానికి అందజేసింది.
మరోవైపు హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి ప్రభుత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. మొత్తం 86.1 కిలోమీటర్ల మేర సాగే ఈ విస్తరణ ప్రాజెక్టు కోసం సుమారు రూ.19,579 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను (DPR) ఆమోదించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విన్నవించింది. కేంద్రం నుంచి ఇటీవల సానుకూల స్పందన రావడంతో పనులు పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది.
ప్రస్తుతం ప్రైవేట్ భాగస్వామ్యంతో నడుస్తున్న మెట్రో ఇకపై పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి రావడం వల్ల సామాన్యులకు మరింత మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ఎల్ అండ్ టీ సంస్థ ఈ పరిణామాలపై ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భాగ్యనగర వాసుల ప్రయాణ కష్టాలను తీరుస్తూ.. మెట్రోను నగరంలోని నలుమూలలకు విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
ALSO READ: GHMC: జీహెచ్ఎంసీ లో పక్కాగా రాంకీ ఒప్పందం అమలు.. రెండు కార్పొరేషన్లు ప్రైవేటుకు అప్పగించే యోచన