తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలో వడగాలుల కొనసాగుతున్న వేళ వాతావరణ శాఖ ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. ఏప్రిల్ 18 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భాగ్యనగరంలో ఏప్రిల్ 19 నుండి 23 వరకు జల్లులు పడే వీలుంది. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఈస్ట్ హైదరాబాద్ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే వర్షాలు పడే ఛాన్స్ ఉంటుందని చెప్పారు. హన్మకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్కర్నూల్ జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండనుంది. ఏప్రిల్ 20 నుంచి 24 వరకు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.
మే, జూన్ నెలల్లో దంచికొట్టనున్న ఎండలు
మరోవైపు మే, జూన్ మాసాల్లో ఎండలు తీవ్రంగా ఉంటాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రభుత్వం ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగాల్పుల ముప్పును దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఒక కీలక ప్రకటనను విడుదల చేసింది. వడగాలులు ప్రాణాంతకమని.. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, చిన్నారులు, బయట పనిచేసే కూలీలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. పారిశుద్ధ్య కార్మికులు, వ్యవసాయ కూలీలు, గృహహీనులపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం హెచ్చరించింది.
ప్రజల సౌకర్యార్థం జిల్లా విపత్తు నిర్వహణ సంస్థలు రంగంలోకి దిగాయి. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లలో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని అధికారులు తెలిపారు. బస్టాండ్లు, మాల్స్, ప్రార్థనా మందిరాల వద్ద చలివేంద్రాలు నిర్మించి మంచినీరు, మజ్జిగ సరఫరా చేయనున్నారు. వేడి వల్ల కలిగే అనారోగ్యాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎప్పటికప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు నిర్వహించనున్నారు.
పాఠశాలలు, పని వేళల విషయంలో ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసింది. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు బయట పనులు చేయవద్దని కార్మికులకు సూచించింది. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 11 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. పాఠశాలల్లో ఆరుబయట తరగతులు నిర్వహించకూడదు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వాటర్ బెల్స్ మోగించి నీరు తాగేలా ప్రోత్సహించాలి. అవసరమైతే స్కూల్ పని వేళలను తగ్గించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సర్కారు ఆదేశించింది. ఆసుపత్రులు, తాగునీటి సరఫరా కేంద్రాలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందించాలని ఇంధన శాఖను కోరింది. ఆసుపత్రుల్లో వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక బెడ్లు, ఐస్ ప్యాకెట్లు సిద్ధం చేశారు. కార్మిక శాఖ ద్వారా ఫ్యాక్టరీ మేనేజర్లకు, కూలీలకు అవగాహన కల్పిస్తున్నారు. పశువుల కోసం నీటి తొట్లు, నీడ ఉన్న ప్రదేశాలను ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖకు సూచించారు. వేడి తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం కోరింది.
ALSO READ: ఉస్మానియాలో దారుణం.. సీనియర్ల వికృత చేష్టలు.. వైద్య విద్యార్థి ఆత్మహత్య!