రాష్ట్రవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. ఆకాశం నుండి నిప్పులు కురుస్తున్నాయా అన్నట్లుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రానున్న ఐదు రోజుల పాటు ఎండల తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఈ జిల్లాల్లో 44 డిగ్రీల టెంపరేచర్.. బయటకు రావొద్దు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. సంగారెడ్డి అలాగే మహబూబ్ నగర్ జిల్లాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 41°C నుంచి 44°C వరకు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో సైతం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. అక్కడ టెంపరేచర్ 36°C నుండి 40°C మధ్య నమోదు కానుంది.
చిన్న పిల్లలు, వృద్దులు జాగ్రత్త..!
పగటి ఉష్ణోగ్రతలు పెరగడంతో పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. దీనివల్ల వృద్ధులు, చిన్నపిల్లలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. వేడి తీవ్రత కారణంగా భూగర్భ జలాలు అట్టడుగుకు చేరుతున్నాయి. చెరువులు కుంటలు ఎండిపోతుండటంతో పశువులకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. అటవీ ప్రాంతాల్లో మంటలు చెలరేగే ముప్పు పొంచి ఉందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కాటన్ దుస్తులు ధరించండి..
తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి. బయటకు వెళ్లేటప్పుడు గొడుగు వాడటం మంచిది. కాటన్ దుస్తులు ధరించడం వల్ల శరీరానికి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవాలి. మజ్జిగ కొబ్బరినీళ్లు వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం.
ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. వడదెబ్బ తగిలిన వారికి చికిత్స అందించేందుకు ఆసుపత్రుల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఉపాధి హామీ కూలీల పని వేళల్లో మార్పులు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటించాలని వాతావరణ శాఖ విజ్ఞప్తి చేస్తోంది.
ALSO READ: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, అప్లై చేశారా..?