Omc case : ఓబులాపురం మైనింగ్ కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పుఇచ్చింది. ఏపీకి చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. గతంలో వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు శ్రీలక్ష్మి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేశారు.ఆ సమయంలో ఓబులాపురం మైనింగ్ కంపెనీకి అనంతపురం జిల్లాలో గనుల కేటాయించారు.దీనికి సంబంధించిన జీవో, నోటిఫికేషన్ అమలు విషయంలో శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. శ్రీలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని సీబీఐ పదేళ్ల క్రితమే న్యాయస్థానంలో ఛార్జ్షీట్ దాఖలు చేసింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ గాలి జనార్ధన్రెడ్డికి అనుకూలంగా పనిచేశారని ఛార్జ్ షీట్ లో పేర్కొంది. శ్రీలక్ష్మి నిర్ణయం వల్ల ప్రభుత్వానికి రూ.కోట్లలో నష్టం జరిగిందనేది సీబీఐ వాదన.
ఈ కేసుపై అప్పటి నుంచి సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.
గతంలో కోర్టులో శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు.తనపై నమోదైన అభియోగాలను కొట్టేయాలని కోరారు. డిశ్చార్జ్ పిటిషన్పై అక్టోబర్ 17న సీబీఐ కోర్టు తీర్పునిచ్చింది. శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను కొట్టివేసేందుకు నిరాకరించింది. దీంతో సీబీఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆమె తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను పరిశ్రమలశాఖ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టకముందే ఓఎంసీ లీజుపై నోటిఫికేషన్ విడుదలైందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. జీవోలో క్యాప్టివ్ మైనింగ్ అని పేర్కొనడం ఉద్దేశపూర్వకమైన కుట్ర అనడం నిరాధారమని శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ఎలాంటి ఆధారాలు లేవంటూ వాదనలు వినిపించారు. అయితే సీబీఐ తరఫు న్యాయవాది అన్ని ఆధారాలు ఉన్నాయని విచారణలో కోర్టు ముందు ఉంచుతామని తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు.. ఓఎంసీ కేసులో శ్రీలక్ష్మిపై నమోదైన అభియోగాలను కొట్టివేసింది.