Minister Uttam: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన నిమిత్తం నియోజకవర్గంలో మంత్రి విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన గరిడేపల్లి మండలం, గడ్డిపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో నేరుగా మాట్లాడారు. అక్కడ జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతాంగానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని.. తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు.
తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని.. రైతాంగానికి పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలబడుతుందని మంత్రి ఉత్తమ్ రైతులకు భరోసాను కల్పించారు. రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. కొనుగోలు కేంద్రాలలో ఉన్న మౌలిక సదుపాయాలను స్వయంగా పరిశీలించిన మంత్రి, అన్ని కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన పూర్తి స్థాయి మౌలిక సదుపాయాల కల్పన జరిగేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలను నమోదు చేసిన 48 గంటల వ్యవధిలో రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ అయ్యేలా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయ ఉత్పత్తి రికార్డులను మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ధాన్యం దిగుబడిలో తెలంగాణ రికార్డ్ సృష్టించిందని, భారత దేశ చరిత్రలోనే ఇంతటి ఉత్పత్తి ఇదే ప్రధమం అని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో అత్యధిక దిగుబడి సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణమని అన్నారు. ఇంతటి ఉత్పత్తి సాధించడం ముమ్మాటికి ప్రభుత్వ ఘనతే అని ఆయన వ్యాఖ్యానించారు. రైతాంగం పట్ల ప్రభుత్వం అనుసరించిన విధానాలు, కల్పించిన సౌకర్యాల వల్లే రాష్ట్రం దిగుబడిలో ఈ రికార్డును సృష్టించగలిగిందని మంత్రి వివరించారు.
దిగుబడిలోనే కాకుండా.. ధాన్యం కొనుగోలులోనూ తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టిస్తోందని మంత్రి ప్రకటించారు. ముందెన్నడూ లేని రీతిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడం ఇదే ప్రప్రథమం అని ఆయన తెలిపారు. యావత్ భారతదేశంలోనే ఇంత పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు గతంలో లేవని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలి అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. వారు స్థానిక కేంద్రాలను సందర్శించి, కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షించాలని సూచించారు.
ALSO READ: China Bridge: ప్రారంభించిన కొన్ని రోజులకే.. కుప్పకూలిన చైనా వంతెన, లక్ ఏమిటంటే