Breakfast Scheme: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణను పోషక లోప రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ చిన్నారులకు బ్రేక్ఫాస్ట్ స్కీంను ప్రారంభిస్తామని తెలిపారు.హైదరాబాద్ మధుర్నగర్లోని మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. బడ్జెట్ కేటాయింపులు, చేసిన ఖర్చులు, అమలవుతున్న పథకాలు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయబోయే పథకాలు, అంగన్వాడి భవనాల నిర్మాణం, అంగన్వాడి కేంద్రాలకు ఉచిత విద్య సరఫరా, అంగన్వాడీ కేంద్రాలకు హాజరు శాతం, ప్రీస్కూల్ యాక్టివిటీ, మిషన్ శక్తి, మిషన్ వాత్సల్య తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఆంగన్వాడీ భవనాల నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. 2199 అంగన్వాడి భవనాలు మంజూరు చేస్తే ఇప్పటివరకు కేవలం 500 భవనాలే పూర్తయ్యాయని.. మిగిలిన భవనాలను త్వరలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా లోపం లేదా నిర్లక్ష్యం జరిగినా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
సాక్ష్యం అంగన్వాడి కింద రాష్ట్రంలోని ఆంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్య, పరిశుభ్రమైన, సానుకూల వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ‘అమ్మ మాట అంగన్వాడి బాట’ అనే నినాదంతో కార్యక్రమాలు ప్రారంభించామని దీంతో అంగన్వాడి కేంద్రాలకు చిన్నారుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద అంగన్వాడి చిన్నారులకు రోజుకు 100 ఎంఎల్ విజయ పాలు సరఫరా చేస్తున్నామని చెప్పారు. కౌమార బాలికల్లో రక్తహీనత తగ్గించేందుకు ఆదివాసీలు అధికంగా ఉన్న మూడు జిల్లాల్లో పల్లి, చిరుధాన్యాల చిక్కిలను అందిస్తున్నామని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా విస్తరించే అంశంపై సమగ్ర నివేదికను అధికారులు సమర్పించాలని ఆదేశించారు.
Also Read: Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం.. చట్టసభల్లో ఆ కీలక మావోయిస్టులకు సీట్లు..?
అంగన్వాడి కేంద్రాలు లేనిచోట, మొబైల్ అంగన్వాడి సేవలను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. మిషన్ వాత్సల్య కింద బాలల రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, మిషన్ శక్తి ద్వారా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి తెలిపారు. అమ్మాయిల భద్రత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. బాల్య వివాహాలు లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. జిల్లాల వారీగా ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతున్నాయని, వాటి వేగాన్ని మరింత పెంచాలని అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవం, పిల్లల ఆరోగ్యం, భద్రత, విద్యలపై ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. తెలంగాణను మహిళలు, పిల్లల సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు నిరంతరం కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీజీ ఫుడ్స్ చైర్మన్ ఫహీం, మహిళా శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనితా రామచంద్రన్, డైరెక్టర్ శృతి ఓజా, టీజీ ఫుడ్స్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.
Also Read: Kishan Reddy: కవితకు తర్వాత ఏం జరుగుతుందో సీబీఐ చెబుతోంది: కిషన్ రెడ్డి