Telangana Municipal Elections 2026: తెలంగాణలో పురపాలక ఎన్నికల నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, 13న ఫలితాలు వెలువడనున్నాయి. రేపటి నుంచే నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పురపాలక ఎన్నికలకు సంబంధించిన సమగ్ర షెడ్యూల్ను విడుదల చేయడంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ నెల 28 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుండగా, 30వ తేదీతో గడువు ముగియనుంది. ఫిబ్రవరి 3న అభ్యర్థుల ఉపసంహరణ తర్వాత, ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, 14న ఎన్నికైన వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లతో పాటు కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ల ఎంపికకు పరోక్ష పద్ధతిలో ఎన్నిక జరగనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల (26.80 లక్షలు) సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం. ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కోసం 16,031 బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేయగా, ఓట్ల లెక్కింపు కోసం 136 కౌంటింగ్ కేంద్రాలను కేటాయించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తక్షణమే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని అధికారులు స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో మేయర్, ఛైర్పర్సన్ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది. మొత్తం స్థానాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించగా, జనాభా ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్థానాలను కేటాయించారు. నిజామాబాద్, నల్గొండ వంటి కీలక కార్పొరేషన్లు జనరల్ మహిళకు కేటాయించబడగా, రామగుండం ఎస్సీ (జనరల్), కరీంనగర్, మంచిర్యాల బీసీ (జనరల్) కేటగిరీలో ఉన్నాయి. బీసీలకు మొత్తం 38 మున్సిపాలిటీల్లో ఛైర్పర్సన్ పదవులు దక్కాయి.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అభ్యర్థుల వ్యయ పరిమితులు, ప్రవర్తనా నియమావళిపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదలయ్యాయి. నగరపాలక సంస్థ (కార్పొరేషన్) పరిధిలో పోటీ చేసే అభ్యర్థులకు గరిష్టంగా రూ. 10 లక్షలు, మున్సిపాలిటీల్లో పోటీ చేసే వారికి రూ. 5 లక్షల వ్యయ పరిమితిని నిర్దేశించారు. అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం ప్రత్యేక బ్యాంకు ఖాతాను తెరవడం తప్పనిసరి. ఫ్లెక్సీలు, బ్యానర్లు మరియు సోషల్ మీడియా ప్రచార ఖర్చులన్నీ అభ్యర్థి ఖాతాలోకే వస్తాయి.
తెలంగాణలో పురపాలక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు లా అండ్ ఆర్డర్ అదనపు డీజీ మహేష్ భగవత్ వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రూ. 50 వేలకు మించి నగదు తీసుకెళ్లే వారు తప్పనిసరిగా రశీదులు కలిగి ఉండాలని, లేనిపక్షంలో సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 22 వేల మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని, 1,926 సమస్యాత్మక (Sensitive), 1,300 అత్యంత సమస్యాత్మక (Critical) పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నిర్మల్, భైంసా, బోధన్, నిజామాబాద్లలో కమ్యూనల్ సెన్సిటివ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని, అయితే మేడారం జాతరకు వెళ్లే భక్తులకు తనిఖీల నుండి మినహాయింపు ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Mahesh Kumar: తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకవు.. బీఆర్ఎస్ పని ఖతం, మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు