Oilfed Action: తెలంగాణ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఆయిల్ ఫెడ్) ప్రధానకార్యాలయంలో సమయపాలన పాటించని అధికారులపై చర్యలు చేపట్టారు. ఆలస్యంగా హాజరైన ఆరుగురు రెగ్యులర్ ఉద్యోగులకు శనివారం మెమోలు జారీ చేశారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్లో ఇద్దరి సేవలను రద్దు చేశారు. మరో ఇద్దరు అధికారులను బదిలీ చేయగా, ముగ్గురు ఉద్యోగులకు మెమోలు జారీ చేశారు. ఆయిల్ ఫెడ్ కార్యాలయాన్ని ఈ నెల 24న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనిఖీ చేశారు.
ఉదయం 10.30 గంటల వరకు పలువురు అధికారులు, ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. ఉద్యోగులు సమయ పాలన పాటించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే ఉద్యోగులపై సేవా నియమావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆయిల్ ఫెడ్ ఎండీ షేక్ యాస్మిన్ బాషాను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు ఎండీ వెల్లడించారు. ప్రభుత్వ సంస్థల్లో సమయపాలన, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన విధి నిర్వహణ, ప్రజలకు సమర్థవంతమైన సేవలందించడం అత్యంత ప్రాధాన్యమైన అంశాలని పేర్కొన్నారు.
Also read: హై అలర్ట్.. తెలంగాణలో నేటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఆ 10 జిల్లాల ప్రజలు జాగ్రత్త!
విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఉద్యోగులు సంస్థ నియమాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిర్ణీత సమయానికి విధులకు హాజరై, సంస్థ ప్రతిష్ఠను మరింత పెంపొందించేలా పనిచేయాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు.
Also Read: Keesara Crime: ఆరో తరగతి బాలికపై.. ఇద్దరు అన్నలు, మేనమామ అఘాయిత్యం!