Pharma Growth: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ ఫార్మా రంగం మరింత విస్తరించేందుకు ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని రకాల సహకారాన్ని అందిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లోని హైటెక్స్లో జరుగుతున్న ఇండియా ఫార్మా ఎక్స్పో-2026 కార్యక్రమానికి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఫార్మా ఎక్స్పో వంటి వేదికలు కొత్త ఆలోచనలు, భాగస్వామ్యాలు, పరిశోధనలకు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ ఔషధ రంగానికి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, మన రాష్ట్రం ఫార్మా, హెల్త్కేర్ రంగాల్లో అగ్రగామిగా నిలిచి ప్రపంచానికి నాణ్యమైన మందులు, వ్యాక్సిన్లు అందిస్తోందన్నారు.
తెలంగాణలో 1500కు పైగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇన్గ్రిడియెంట్స్ , బల్క్ డ్రగ్స్, వ్యాక్సిన్లు, మెడికల్ డివైసెస్ తదితర తయారీ యూనిట్ల బలమైన వ్యవస్థ ఉన్నదన్నారు. 80కు పైగా టెస్టింగ్ సెంటర్లు, 50 వేలకుపైగా మెడికల్ షాపులు ఉన్నాయన్నారు. కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ ప్రపంచానికి మందులు, వ్యాక్సిన్లు సరఫరా చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకుందన్నారు. వ్యాధుల చికిత్సలో, ఔషధ తయారీలోనూ హైదరాబాద్ ప్రపంచానికి విశ్వసనీయ కేంద్రంగా నిలిచిందన్నారు. మన రాష్ట్రంలో ఉన్న ప్రతిభావంతులైన వైద్యులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ విజయానికి బలమైన ఆధారమన్నారు.
Also Read: డేంజర్ బెల్స్.. రాష్ట్రంలో తగ్గుతున్న భూగర్భ జలాలు
మెడికల్, ఫార్మా రంగాల్లో ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తోందన్నారు. ఈ విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం అందరి బాధ్యత అన్నారు. నాణ్యత, భద్రత, పారదర్శకత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదన్నారు. ఔషధ రంగంలో చిన్న నిర్లక్ష్యం కూడా అంతర్జాతీయ స్థాయిలో మనపై ప్రభావం చూపే ప్రమాదం ఉన్నదని, అందుకే అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. నకిలీ మందులు, నాసిరకం ఔషధాలు ప్రజారోగ్యానికి పెద్ద ముప్పు అని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందన్నారు. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ద్వారా కట్టుదిట్టమైన పర్యవేక్షణ, చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
Also read: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ షాక్.. బీజేపిలోకి ముగ్గురు రాజ్యసభ సభ్యులు జంప్..?