Phone Tapping Case:తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సిట్లో సభ్యులుగా అంబర్కిషోర్ ఝా, ఎస్ఎం విజయ్కుమార్, రితురాజ్, నారాయన్రెడ్డి, రవీందర్రెడ్డి, కేఎస్ రావు, వెంకటగిరి, శ్రీధర్, నాగేందర్రావు ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పలువురి ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక వ్యక్తులను విచారిస్తుంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారంతో ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితో గత వారం రోజులుగా సిట్ ఆయనను విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో.. సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు.
గత ఏడు రోజులుగా జరిగిన విచారణలో ప్రభాకర్ రావు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించినట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? డేటా ధ్వంసం వెనుక ఉన్న వ్యూహం ఏమిటి? అనే కోణంలో అధికారులు ప్రభాకర్ రావుపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ విచారణను హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సీపీ, కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పేర్కొన్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై శుక్రవారం సుప్రీంకోర్టు విచారించనుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు చెప్పిన వివరాలు, సేకరించిన ఆధారాలతో కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read: Panchayat elections: సర్పంచ్ ఎన్నికలు.. ఎవరికెన్ని సీట్లు అంటే..