Telangana Rythu Bima: రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తుంది. బడ్జెట్ లో నిధుల కేటాయింపే కాదు.. రైతు దురదృష్టవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి భరోసా ఇస్తుంది. పట్టదారు పాసుబుక్ ఉన్న రైతులందరికీ సామాజిక భద్రత కల్పిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తోంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రతిష్టాత్మకమైన పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ‘రైతు బీమా’, ‘రైతు నేస్తం’ కార్యక్రమాలు చేపట్టింది. క్షేత్రస్థాయిలో ఈ రెండు పథకాలు ఫలితాలను అందిస్తున్నాయి. అన్నదాత కుటుంబానికి రైతు బీమా పథకంతో రూ. 5 లక్షల భరోసా ఇస్తుంది.ఈపథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల లోపు వయస్సు కలిగిన పట్టాదారు రైతులందరికీ ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తోంది. రైతు దురదృష్టవశాత్తూ మరణిస్తే, ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా సొమ్మును ప్రభుత్వం అందిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుంది.
2023-24లో సుమారు 25.9వేల కుటుంబాలకు రూ. 1,297 కోట్లు, 2024-25లో 25.7వేల కుటుంబాలకు రూ 1,287 కోట్లు, 2025-26లో ఈ ఏడాది ఫిబ్రవరి 2026 వరకు 10,511 కుటుంబాలకు రూ.525.55 కోట్లు ఆర్థిక సాయంను ప్రభుత్వం అందజేసింది. మూడేళ్లలో 3105.55కోట్లు రైతు కుటుంబాలకు అందజేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నప్పటికీ కొన్ని పరిస్థితుల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు అండగా నిలుస్తుంది.
Also Read:BRS Party: కాంట్రవర్సీలపై గులాబీ దృష్టి.. అధికార పక్షంకు మాట్లాడే అవకాశం ఇవ్వొద్దని వ్యూహం?
వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం ‘రైతు నేస్తం’ అనే డిజిటల్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించింది. ₹96.63 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు ద్వారా ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ యూనిట్ల ద్వారా రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1,600 రైతు కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వెబెక్స్ ఆధారిత చర్చల ద్వారా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయి సమస్యలకు అప్పటికప్పుడే పరిష్కారాలను సూచిస్తారు. ఫిబ్రవరి 2026 నాటికి 84 ఎపిసోడ్ల ద్వారా సుమారు 20.68 లక్షల మంది రైతులకు (వీరిలో 3.34 లక్షల మంది మహిళా రైతులు) అవగాహన కల్పించారు. ఇది పరిశోధనా సంస్థలకు మరియు రైతులకు మధ్య దూరాన్ని తగ్గిస్తూ ‘ల్యాబ్ టు ల్యాండ్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. అదే విధంగా వ్యవసాయ వృద్ధికి, గ్రామీణ జీవనోపాధి మెరుగుదల కోసం వ్యవసాయ పరపతి (రుణాలు) అత్యంత కీలకమైన అంశమని ఈ నివేదిక పేర్కొంది. స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి రైతులకు అవసరమైన ఆర్థిక సాయం అందించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులు, మహిళా రైతులు,కౌలు రైతులకు సకాలంలో తగినంత ఆర్థిక చేయూతను అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆధునిక వ్యవసాయ సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి, నాణ్యమైన విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఈ రుణాలు రైతులకు ఎంతగానో తోడ్పడుతున్నాయి. వ్యవసాయ రుణాల పంపిణీలో రాష్ట్రం స్థిరమైన వృద్ధిని కనబరుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 88.43% మేర రుణాలను పంపిణీ చేసింది. 2024-25లో రుణ లక్ష్యాన్ని గణనీయంగా రూ. 90,795.2 కోట్లకు పెంచగా, ఫిబ్రవరి 2026 నాటికి 80.52% లక్ష్యాన్ని చేరుకుంది. వ్యాపార బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు రైతుల స్వల్పకాలిక, దీర్ఘకాలిక అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.ఇది ఇలా ఉంటే సరైన సమయంలో సరైన మోతాదులో ఎరువుల వినియోగం ద్వారా పంట దిగుబడిని పెంచి, రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.
Also Read: Congress Party: కాంగ్రెస్లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. ఏప్రిల్ టార్గెట్గా హైకమాండ్ ప్లాన్!