పోలవరం ప్రాజెక్టు నుండి సుమారు 200 టీఎంసీల గోదావరి జలాలను బనకచర్ల/నల్లమలసాగర్కు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. తెలంగాణ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ మళ్లింపు పూర్తిగా ఏకపక్షమని, ఇది అంతర్రాష్ట్ర జల వివాదాల ట్రిబ్యునల్ (GWDT) అవార్డుకు విరుద్ధమని స్పష్టం చేశారు.
గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీటి పరిమాణం 484.5 టీఎంసీలు మాత్రమేనని.. వరద జలాల పేరుతో అదనంగా 200 టీఎంసీలను మళ్లించడం అక్రమమని సింఘ్వీ వాదించారు. ఎగువ రాష్ట్రాలైన తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అనుమతి లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా, తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల వినియోగానికి ఏపీ చర్యల వల్ల తీవ్ర విఘాతం కలుగుతుందని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర జల సంఘం (CWC) మార్గదర్శకాల ప్రకారం ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) సమర్పించకుండానే ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడం నిబంధనల ఉల్లంఘన అని సింఘ్వీ పేర్కొన్నారు. గోదావరి నదిలో అదనపు వరద జలాలు ఉన్నాయని తేల్చడానికి దేశంలో ఎటువంటి అధికారిక యంత్రాంగం లేదని, అటువంటి పరిస్థితుల్లో ఏపీ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదని అన్నారు. ఒకవేళ అదనపు జలాలు ఉన్నా.. వాటిని ఏడు బేసిన్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేయాలి తప్ప ఏపీ ఒక్కటే వినియోగించుకోకూడదని వాదించారు.
జనవరి 2, 2026న కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని, ఆ కమిటీ నివేదిక ఇచ్చే వరకు ఏపీ తన పనులను నిలిపివేసేలా స్టే ఇవ్వాలని తెలంగాణ కోరింది. నవంబర్ 21, 2025న ఏపీ జారీ చేసిన రెండో టెండర్ ప్రక్రియను కొనసాగిస్తే, అది భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని.. కాబట్టి తక్షణమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సింఘ్వీ తన వాదనలను ముగించారు.
ALSO READ: BRS: కల్వకుంట్ల కవితపై ఓ రేంజ్లో మండిపడ్డ బీఆర్ఎస్ మహిళా నేతలు