పశ్చిమ బెంగాల్లో అంతా అనుకున్నట్టుగానే దీదీకి చెక్ పడింది. తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఇక్కడ బీజేపీ గట్టెక్కింది. ఘన విజయం సాధించింది. కొత్త చరిత్ర సృష్టించింది. చాలా మంది అక్కడ భాయనక రాజకీయ వాతావరణాన్ని వ్యతిరేకించారు. ఆ భయం పోగొట్టే క్రమంలో కేంద్రం సక్సెసయ్యింది. ధైర్యంగా ఓటేసే స్వేచ్చాయుత వాతావరణానికి అనువుగా మార్చడమే అక్కడ బీజేపీ విజయంగా భావించింది. కేంద్ర హోం మంత్రి దీనికి ఆద్యుడిగా నిలిచాడు. మొదటి నుంచి బెంగాల్ మీద కన్నేశాడు.
దీదీ మమతా బెనర్జీని ఓడించమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందుకే రెండు దఫాలుగా జరిగిన ఎన్నికల్లో అమిత్ షా ప్రత్యేక దీష్టి సారించారు. ప్రత్యక్షంగా అక్కడ ఉండి మరీ పరిస్థితులు సమీక్షించారు. ఎస్ఐఆర్ విధానంతో ఓట్లను తొలగించే పనిని ఎన్ని విమర్శలొచ్చినా పకడ్బందీగా అక్కడ అమలు చేసి చూపించాడు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ఓటర్లను టార్గెట్ చేశాడు. బోగస్ ఓట్ల ఏరివేత పేర.. హిందువుల కోసం మేం పోరాడుతున్నాం… మీ అండగా ఉంటాం.. భయపడకుండా ఓటేయండనే సంకేతాన్నించేందుకు అమిత్ షా విపరీతంగా ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో సక్సెసయ్యాడు కూడా. దాదాపు 90 లక్షల ఓట్లు వరకు తొలగించడమే పెద్ద వివాదమైంది.
అక్కడే దీదీకి కూడా అనుమానమొచ్చింది. తన ఓటమి పక్కా అని తెలుసుకోగలిగింది. చివరి వరకు పోరాడింది. కానీ… అప్పటికే క్షేత్రస్థాయిలో అమిత్ షా తిప్పిన చక్రంతో ఓటర్లలో భారీ మార్పు కనిపించింది. కేంద్ర బలగాలు సీఆర్ఫీఎఫ్, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లను దింపడం.. ఎస్ఐఆర్తో ఓట్ల గల్లంతు.. హిందూ, ముస్లిం ఫీలింగు తీసుకురావడంతో బీజేపీ సక్సెసయ్యింది. అక్కడ 30 శాతం మేర ముస్లిం మైనార్టీలున్నారు. 70 శాతంగా ఉన్న హిందువులను లక్ష్యంగా చేసుకుని .. వారిలో ఐక్యత తీసుకురావడం ఒక భాగమైతే.. దీదీ అప్పటి వరకు అక్కడ నడిపించిన నియంతృత్వ పాలన, భయానక రాజకీయ క్రీడ తదితర అనుభవాలను ప్రజల్లోకి చేరవేయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. జనాల్లో మేమున్నాం.. మీకు తోడుగా.. భయపడొద్దు అనే నినాదాన్నే బలంగా తీసుకుపోగలిగింది. అసలు బీజేపీ గెలుస్తుందా? ఎందుకు ఓటేయాలి? ఒకవేళ వేస్తే.. తమ మీద దాడులు జరుగుతాయి..? అనే భయపడే వాతావరణం నుంచి.. ఇప్పుడు అంతా బీజేపీ హవా కొనసాగుతోంది.. కచ్చితంగా గెలిచి తీరుతుంది.. అని భయపడకుండా ఓటేసే దాకా పరిస్థితిని తమకు పాజిటివ్ వేవ్లో తీసుకురాగలిగారు.
దీనికంతటికీ కర్త, కర్మ, క్రియగా అమిత్ షా… వెనుకుండి మరీ నడిపించాడు. ఇందులో అనుమానం లేదు. రిజల్టుకు ముందే అది తెలిసిపోయింది కూడా. తన అధికారిక నివాసం ఖాళీ చేయడంతోనే ఫలితాలకు మందు అది రూఢీ అయిపోయింది. ఇక ఇక్కడ తెలంగాణలో బీజేపీ శ్రేణుల ఆనందానికి అంతు లేకుండా పోయింది. అమిత్ షా వ్యూహంపై వారిక అపార విశ్వాసం ఏర్పడింది. బెంగాల్ వ్యూహాన్నే రానున్న ఎన్నికల్లో తెలంగాణలో కూడా అమలు చేసి అధికారంలోకి తెస్తారని అనుకుంటున్నారంతా. ఇప్పటికే ఇక్కడ ఎస్ఐఆర్ను అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ తాము చేసేది తాము చేసి తీరుతామని కచ్చితమైన నిశ్చయంతో కేంద్రం ఉంది. అయితే.. ఎంత చేసినా.. ఎన్ని రకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసినా.. తెలంగాణలో అధికారం చేజిక్కించుకునేంతగా మాత్రం బీజేపీ సీట్లు సాధించడం కల్ల. అది ఇక్కడి బీజేపీ నేతలకూ తెలుసు.
కానీ కీలకంగా ఓ 30 సీట్ల దాకా గెలిచినా.. అది తమ విజయంగా, అధికారాన్ని దక్కించుకునే వ్యూహానికి దగ్గరగా చేరినట్టేనని భావిస్తున్నారు. బీఆరెస్తో సపోర్టుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే వీలుంటుందని, తామే కింగ్, కింగ్ మేకర్ కూడా కాగలమనే ధీమా వారిలో వచ్చినట్టు బెంగాల్ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణ కాషాయ శిబిరంలో కొత్త ఉత్సాహం కనిపిస్తున్నది.