Electricity Complaints: స్వేచ్ఛ బ్యూరో: తెలంగాణ విద్యుత్ వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కారంలో సరికొత్త విప్లవం రాబోతోంది. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ విద్యుత్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత సేవలను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత పెంచే దిశగా విద్యుత్ సంస్థలు కీలక అడుగు వేస్తున్నాయి. నిరంతరం బిజీగా ఉండే కస్టమర్ కేర్ నంబర్ల సమస్యకు చెక్ పెడుతూ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్, వాయిస్ బాట్ సేవలను ప్రవేశపెడుతున్నాయి. ప్రయోగాత్మక దశను పూర్తి చేసుకున్న ఈ చాట్ బాట్ సేవలు మార్చి నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. వినియోగదారులు తమ మొబైల్ ద్వారా వాట్సాప్ లేదా వెబ్సైట్ వేదికగా విద్యుత్ కోతలు, బిల్లింగ్ తప్పులు, మీటర్ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. చాట్ బాట్ తక్షణమే స్పందించి ఫిర్యాదును నమోదు చేయడమే కాకుండా, అది ఏ దశలో ఉందో కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తుంది.
చాట్ బాట్ విజయవంతమైన కొద్ది రోజుల్లోనే వాయిస్ బాట్ సేవలను కూడా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్) సంస్థ ప్రారంభించనుంది. వాయిస్ బాట్ కు సంబంధించిన శిక్షణ ఇంకా కొనసాగుతున్న తరుణంలో వాయిస్ బాట్ అందుబాటులోకి వచ్చేందుకు మరో నెలరోజులు పట్టే అవకాశముంది. దీనివల్ల వినియోగదారులు కాల్ సెంటర్కు ఫోన్ చేసినప్పుడు సిబ్బందితో మాట్లాడాల్సిన పని లేకుండా, ఏఐ బాట్ నేరుగా మీ మాటలను అర్థం చేసుకుని ఫిర్యాదులను స్వీకరిస్తుంది. మ్యాన్యువల్ విధానంలో తలెత్తే జాప్యాన్ని ఇది పూర్తిగా నివారిస్తుంది. గతంలో విద్యుత్ సమాచారం, ఫిర్యాదులను 1912 నంబర్ ద్వారా కాల్ సెంటర్ కు తెలియజేయడం జరిగేది. గతంలో వినియోగదారుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ ను ఆన్సర్ చేసేందుకు సంస్థ ఉద్యోగులు ఉండేవారు. ఇక వారి స్థానాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భర్తీ చేయనుంది.
Also Read: CCI: రైతులకు బిగ్ అలర్ట్.. పత్తి కొనుగోళ్ల గడువును పొడిగించిన సీసీఐ..!
ఇప్పటివరకు ఫిర్యాదులను నమోదు చేసేందుకు వినియోగించిన మ్యాన్యువల్ విధానానికి తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ స్వస్తి పలకనుంది. కాల్ సెంటర్లలో ఫిర్యాదులు స్వీకరించేందుకు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ సిబ్బంది స్థానాన్ని భర్తీ చేయనుంది. అయితే, ఈ మార్పు వల్ల ఉద్యోగ కోతలకు తావులేకుండా, ప్రస్తుతం అక్కడ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఇతర విభాగాల్లోకి బదిలీ చేయాలని విద్యుత్ శాఖ నిర్ణయించింది. క్షేత్రస్థాయిలో సమస్యల పర్యవేక్షణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో వీరి సేవలను వినియోగించుకోనున్నారు. కాగా అతికొద్ది సాంకేతిక సమస్యలు ఎదురైతే అత్యవసర సమయంలో కొంత సిబ్బంది అవసరం కాబట్టి అతి కొద్దిమంది సిబ్బందితో కొనసాగించనున్నారు.
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ తీసుకున్న ఈ నిర్ణయం సరికొత్త విప్లవానికి దారితీసింది. 24/7 సిబ్బందితో సంబంధం లేకుండా ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చు. ఫోన్ లైన్లు బిజీగా ఉండటం వంటి సమస్యలు ఉండవు. ఫిర్యాదు నమోదు కాగానే వినియోగదారుడికి ట్రాకింగ్ ఐడీ అందుతుంది. దీంతో పారదర్శకంగా సేవలు అందుతాయి. రాబోయే వేసవి కాలంలో విద్యుత్ డిమాండ్ సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉన్నందున, అలాగే మానవ వనరుల వినియోగాన్ని ఫిర్యాదుల నమోదు కంటే వాటిని పరిష్కరించే క్షేత్రస్థాయి పనులపై సిబ్బంది ఎక్కువ దృష్టి సారించవచ్చని ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ అన్నారు.
Also Read: Boggula Srinivas Murder: పవన్ కళ్యాణ్ పుస్తక రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతి.. మిస్టరీ వీడింది!