Temple Development: స్వేచ్ఛ బ్యూరో: ఆలయాల అభివృద్దిపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే బాసర, భద్రాచలం ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆలయ పునర్నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూరైనట్లు సమాచారం. ఆ టెండర్ల ప్రక్రియను ఆన్ లైన్ లో కొనసాగించగా రెండు ఏజెన్సీలు దక్కించుకున్నాయని సమాచారం. ఈ ఏజెన్సీలు త్వరగా పనులు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగా త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
రూ.586 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మాస్టర్ ప్లాన్ను రెడీ చేసింది. గత నెల 27న సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రూ.351 కోట్లు మొదటి దశ పనులకు ఇప్పటికే పరిపాలనా అనుమతులు లభించగా, ఈ పనులకు సంబంధించి టెండర్డు ఖరారు అయినట్లు సమాచారం. ఆన్ లైన్ లో క్షేత్ర ఏజెన్సీ పనులు దక్కించుకున్నట్లు సమాచారం. ఆలయ అభివృద్ధి పనులను మూడు దశల్లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.
2027 గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో ఈ పనులు త్వరగా పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ఆగమ శాస్త్రానుసారంగా ఆలయ నిర్మాణ పనులు చేపట్టబోతున్నారు. గోదావరి ఘాట్ల విస్తరణ, భక్తులకు మెరుగైన మౌలిక వసతులు, ఆలయ పరిసరాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు ఎండోమెంట్ అధికారులు తెలిపారు. ప్రధాన ఆలయంతోపాటు ప్రాకారాలు, మండపాలు, భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, వసతి గృహాల నిర్మాణాన్ని ఈ నిధులతో చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు. తొలిదశలో గోదావరి ఘాట్ల విస్తరణ, భక్తులకు వసతులు, రెండో దశలో కప్పా రామకృష్ణ భూమి (6 ఎకరాలు) అభివృద్ధి, మూడో దశలో భద్రాచలం పట్టణ అభివృద్ధి జరుగనుంది.
Also Read: రాహుల్ గాంధీ చెప్పిందే జరిగింది.. మహిళా బిల్లుపై కేంద్రం తప్పటడుగు ఎక్కడ వేసింది?
రూ.225 కోట్లతో బాసర జ్ఞాన సరస్వతీ ఆలయం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఆలయ ప్రాంగణాన్ని విస్తరించడంతోపాటు మాడ వీధులు, పుష్కరిణి అభివృద్ధి పనులను చేపట్టనున్నట్లు సమాచారం. ఆలయ టెండర్లను తనిళ్ల ఏజెన్సీ దక్కించుకుంటున్నట్లు సమాచారం. ఆలయ పునర్నిర్మాణంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శృంగేరి పీఠాధిపతుల సంప్రదింపులతో తుది ప్రణాళిక సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. గర్భాలయం, అర్థ మండపం, గోపురాలు, మాడ వీధుల నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్నట్లు సమాచారం. 2 వేల చదరపు అడుగుల్లో ఉన్న గర్భాలయ పరిధిని 5 వేల చదరపు అడుగులకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆలయానికి ఉత్తరం వైపున 9 అంతస్తుల రాజగోపురాన్ని, మిగిలిన మూడు దిశల్లో 7 అంతస్తుల గోపురాలను నిర్మించబోతున్నారు. 33 అడుగుల వెడల్పుతో నాలుగు దిక్కుల మాఢ వీధులు, ఉత్తర ద్వారం నిర్మించబోతున్నారు.
ఆలయ విస్తీర్ణాన్ని 20 వేల చదరపు అడుగుల నుంచి 62 వేల చదరపు అడుగులకు పెంచనున్నారు. 6 వేల మంది ఒకేసారి వేచి ఉండేలా ఫీడింగ్ రూమ్, ఫుడ్ స్టాల్స్, టాయిలెట్స్ తదితర మౌలిక వసతులతో 70 వేల చదరపు అడుగులతో క్యూ కాంప్లెక్స్లు, 200 మంది ఏకకాలంలో కూర్చొని ధ్యానం చేసుకునేలా ధ్యాన మందిరం, 20 వేల చదరపు అడుగుల వైశాల్యంతో వంటశాల, భోజన శాలలు, ప్రసాద పంపిణీ కేంద్రం, ఈశాన్య దిక్కున కోనేరు.. తూర్పు దిక్కున ఆధ్యాత్మికత పరిఢవిల్లేలా తోరణాలు, సమాచార కేంద్రం, దేవాలయానికి ఉత్తర, తూర్పు దిక్కుల్లో రోడ్ల అభివృద్ధి, దేవాలయం నుంచి ఆవతలి వైపు వెళ్లేందుకు అండర్ పాస్, సోలార్ రూప్టాప్తో వెహికల్స్ పార్కింగ్, దేవాలయ ప్రాంగణంలో ఆహ్లాదకరమైన మొక్కలతో పుష్పవనం పనులు చేపట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ ప్రాంగణం సమీపంలో హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటిని ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నారు. భక్తులను ఆకర్షించేలా మౌలిక వసతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆ ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా వీడియోలు సైతం ప్రదర్శించేందుకు సైతం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా భక్తులకు ఎలాంటి మౌలిక సదుపాయాల కొరత లేకుండా సీఎం ప్రత్యేక దృష్టిసారించినట్లు తెలిసింది. సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు అధికారులకు సూచనలు సైతం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ తొలి విడతలో బాసర, భద్రాచలం ఆలయాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
Also Read: రేపే తెలంగాణ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్!