Telangana Thalli Statue: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ స్ఫూర్తిని, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా తెలంగాణ ప్రభుత్వం.. మరో చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్టించి, రాష్ట్ర సాంప్రదాయం, సంస్కృతికి ప్రతీకగా నిలిపే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ విగ్రహాలను నేడు సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ ద్వారా ఆవిష్కరించనున్నారు. ఆయనతో పాటు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఇతర మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో గతంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టించిన విధంగా, ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్లలో ఇదే నమూనాను అనుసరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం 33 జిల్లాల్లో ప్రతి కలెక్టరేట్ ఆవరణలో ఒక విగ్రహం ఏర్పాటు చేయడానికి సుమారు రూ. 17.50 లక్షల చొప్పున మొత్తం రూ. 5.80 కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది.
తెలంగాణ తల్లి విగ్రహం మొత్తం ఎత్తు 18 అడుగులు.. అందులో విగ్రహం ఎత్తు 12 అడుగులు, దిమ్మె 6 అడుగులు. పల్లెటూరి మహిళా రైతు రూపంలో ఆమెను తీర్చిదిద్దడం ద్వారా తెలంగాణ భూమి, బతుకుదెరువు, వ్యవసాయం, పోరాట పటిమలను ప్రతిబింబించేలా రూపొందించారు.
తెలంగాణకు ప్రత్యేకమైన ఆకుపచ్చ చీరను పసుపుపచ్చ బంగారు అంచులతో అలంకరించి, తెలంగాణ సాంప్రదాయానికి నిదర్శనంగా నిలుస్తున్న మొక్కజొన్న, సజ్జ, గోధుమ పంటలను ఆమె ఎడమచేతిలో అలంకారంగా ఉంచారు. అలాగే నుదుటిపై ఎర్రటి బొట్టు, చెవులకు కమ్మలు, మెడలో సంప్రదాయ గుండుపూసల హారం, చేతులకు మట్టి గాజులు, కాళ్లకు కడియాలు, ముక్కుపుడక వంటి ఆభరణాలతో తెలంగాణ మహిళా స్వభావాన్ని ప్రతిబింబించేలా శిల్పాన్ని రూపొందించారు. ముఖంపై ప్రసన్నమైన చిరునవ్వు, ఆశాభావం ప్రతిబింబించేలా విగ్రహాన్ని ముఖ్యమంత్రి సూచనల మేరకు డిజైన్ చేశారు.
ఈ విగ్రహాలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలకు చేరే వేలాదిమంది ప్రజలకు ఆకర్షణగా నిలవడమే కాకుండా, తెలంగాణ ప్రజల ఐక్యత, సంస్కృతి, విలువలకు ప్రతీకగా నిలుస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రతి జిల్లా పరిపాలనా కేంద్రంలో తెలంగాణ గౌరవ చిహ్నం నిలుస్తుండటం చారిత్రాత్మక నిర్ణయంగా రాజకీయ, సాంస్కృతిక వర్గాలు అభివర్ణిస్తున్నాయి.
Also Read: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ చుట్టూ రాజకీయాలు.. అదెలా జరిగింది బిడ్డా?
డిసెంబర్ 9న నిర్వహించనున్న తెలంగాణ తల్లి దినోత్సవం సందర్భంగా ఈ విగ్రహాల ఆవిష్కరణను ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమంగా ప్రకటించింది. రాష్ట్రంలోని 27 జిల్లా కలెక్టరేట్లలో పూర్తిగా సిద్ధమైన విగ్రహాలను నేడు వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. నిర్మాణంలో ఉన్న మిగిలిన 6 జిల్లాలు ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ములుగు, నల్గొండ, నారాయణపేట్లో శిల్పాలు సిద్ధమైన వెంటనే అక్కడ కూడా ఆవిష్కరణ చేపట్టనున్నట్లు కోమటి రెడ్డి తెలిపారు.