CM Revanth Reddy: తెలంగాణ తల్లి సాక్షిగా రాష్ట్రాన్ని సంక్షోభం నుండి సంక్షేమం వైపుకు సాగిస్తూ.. ప్రజా పాలన అందించడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యావత్ తెలంగాణ మొత్తం పండగ చేసుకునే పర్వదినం డిసెంబర్ 9గా అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు చేపట్టి మొదటి ఏడాదిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుందని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకోవడం మనందరికీ గర్వకారణమన్నారు.
ఉమ్మడి రాష్ట్రం సమయంలో తెలంగాణ సంస్కృతిని అవహేళన చేశారని, నేడు మన సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పేలా తెలంగాణ తల్లిని ఏర్పాటు చేసుకున్నామన్నారు. గత పాలకులు కుటుంబం గురించి ఆలోచించారే కానీ యావత్ తెలంగాణ గర్వించేలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్న ఆలోచనకు నోచుకోలేదంటూ బీఆర్ఎస్ లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తాను తెలంగాణ తల్లిని చూసిన సమయంలో తన తల్లిని చూసిన భావన కలిగిందని, అదే భావన యావత్ తెలంగాణ కలిగే విధంగా తెలంగాణ తల్లిని రూపొందించినట్లు తెలిపారు.
కవులు కళాకారులకు కానుకలు..
తెలంగాణ అంటేనే కవులు, కళాకారులకు పుట్టినిల్లని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఎందరో కవులు, కళాకారులు, రచయితలు వారి పాటలతో యావత్ తెలంగాణ యువతను చైతన్యపరిచి ఉద్యమం వైపు సాగించడంతోనే తెలంగాణ సాధ్యమైందని సీఎం అన్నారు. తెలంగాణ కోసం గొప్ప కవులు, కళాకారులు కృషి చేశారని, వారిని సన్మానించుకోవడం సత్కరించుకోవడం మన బాధ్యతగా సీఎం పేర్కొన్నారు.
వారిలో గూడా అంజయ్య, గద్దరన్న, బండి యాదగిరి, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, పాశం యాదగిరి, యాదగిరి రావులకు ఫ్యూచర్స్ సిటీలో 300 గజాల స్థలము, ప్రభుత్వం నుండి కోటి రూపాయల ఆర్థిక సాయం, తామర పత్రాన్ని కూడా అందజేస్తున్నట్లు సీఎం బహిరంగ సభ సాక్షిగా ప్రకటించారు. అనంతరం ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ప్రజలను ఆకట్టుకుంది. ఈ డ్రోన్ షో ద్వారా ప్రభుత్వం ఏడాది కాలంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రతిబింబించేలా ఏర్పాటు చేయడం విశేషం. ప్రజా పాలన ముగింపు ఉత్సవాల సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ జనసంద్రంగా మారాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.