TG Village Roads: స్వేఛ్చ బ్యూరో: పల్లెలు రోడ్ల కష్టాలతో అల్లాడుతున్నాయి. గడిచిన పదేళ్లలో పల్లె ప్రగతి అని గొప్పలు చెప్పుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమనేది స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయిలో మాత్రం ప్రయాణం నరకప్రాయంగానే ఉంది. రాష్ట్రంలోని వేలాది పంచాయతీలకు నేటికీ సరైన తారు రోడ్డు (బీటీ) సౌకర్యం లేదు. ఉన్న రోడ్లేమో కురిసిన వర్షాలకు చిధ్రమైపోయాయి. అడుగడుగునా గుంతలు పడి, కంకర తేలి ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఇంత జరుగుతున్నా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ విభాగాధిపతులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీలు, మారుమూల తండాలు, గూడేలకు నేటికీ బీటీ రోడ్ల అనుసంధానం లేదు. తాజా సమాచారం ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,800 నుంచి 2,000 వరకు ఆవాసాలకు ఇప్పటికీ కనీస తారు రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలం వస్తే ఈ గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి, బురదలో నడవాల్సిన దుస్థితి నెలకొంది. ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం తప్ప, ఆ తర్వాత పట్టించుకునే నాథుడే కరువయ్యాడు.
గత సీజన్లో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పంచాయతీ రాజ్ రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7వేలకిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు ప్రాథమిక అంచనా వేశారు. రోడ్ల పైపొరలు కొట్టుకుపోయి జల్లి తేలాయి. కల్వర్టులు, కాజ్వేలు దెబ్బతిని రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖకు ఇప్పటివరకు రూ.1,157.46 కోట్ల నష్టం వాటిల్లినట్లుగా సర్కారుకు ఆ శాఖ నివేదికను అందజేసింది. తాత్కాలిక మరమ్మతులకు రూ.53.76 కోట్లు కావాలని నివేదికలో పేర్కొంది.
Also Read: Nalgonda District: ఉత్కంఠగా మిర్యాలగూడ చైర్మన్ ఎన్నిక.. కీలక నేతల గుండెల్లో గుబులు
ఆర్అండ్బీ శాఖ నివేదికలోని వివరాల ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 794 ప్రాంతాల్లో సమస్యాత్మక రోడ్లను గుర్తించారు. వీటిలో 1,039 కి.మీ మేర రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. 31 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. 10 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 356 చోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తోంది. 305 చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగితే, 236 చోట్ల ట్రాఫిక్ను దారి మళ్లించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. మెదక్లో 52 కి.మీ మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. రోడ్లపై 33 చోట్ల వరద ప్రవహించింది. 5 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 4 చోట్ల వంతెనలు దెబ్బతినగా వాటి అప్రోచ్ రోడ్లు కోతకు గురయ్యాయి. ప్రతి ఏటా ఇదే తంతు జరుగుతుంది. తాత్కాలిక మరమ్మతులతోనే సరిపుచ్చుతుండటంతో వర్షాకాలంలో రోడ్లు గుంతలమయంగా మారుతున్నాయి.
దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడం, కొత్తగా బీటీ రోడ్లు వేయడం కోసం పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వరదలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు దాదాపు రూ.600 కోట్లు. రోడ్ల రెన్యూవల్స్, కొత్త నిర్మాణాలకు కలిపి సుమారు రూ. 2,000 నుంచి 2,500 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు తెలిసింది. కానీ, ప్రభుత్వం నుంచి కొన్నింటికి మాత్రమే గ్రీన్ సిగ్నల్ రాగా, మరికొన్నింటికి పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. కాంట్రాక్టర్లకు పాత బిల్లులు పెండింగ్లో ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రారంభమైన పనులు సైతం నత్తనడకన సాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఈఎన్సీల పనితీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈఎన్సీలు, ఉన్నతాధికారులు కేవలం హైదరాబాద్లోని ఎర్రమంజిల్ కార్యాలయాలకే పరిమితమయ్యారని, జిల్లాల్లో పర్యటించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ఎస్ఈ, ఈఈ లు ఏం చేస్తున్నారో పర్యవేక్షించే నాథుడే లేడని విమర్శలు వస్తున్నాయి. క్వాలిటీ కంట్రోల్ పూర్తిగా గాలిలో కలిసిపోయిందనే ప్రచారం జరుగుతుంది. నెలకోసారి జూమ్ మీటింగ్లు, సమీక్షలు నిర్వహించడం తప్ప.. రోడ్ల దుస్థితిని స్వయంగా పరిశీలించి, ప్రభుత్వానికి నివేదించి నిధులు రాబట్టడంలో ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, పెండింగ్ బిల్లులు క్లియర్ చేసి, కొత్త రోడ్లకు నిధులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఈఎన్సీలు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని డిమాండ్ లు వస్తున్నాయి.
Also Read: Minister Seethakka: వీది కుక్కలను చంపిన సర్పంచ్లపై కఠిన చర్యలు: మంత్రి సీతక్క