Minister Seethakka: స్ట్రే డాగ్స్ను దత్తత తీసుకోవడం ద్వారా వాటికి జీవించే హక్కును కల్పించడమే కాకుండా సమాజంలో మానవత్వాన్ని పెంపొందించవచ్చని మంత్రులు సీతక్క, కొండా సురేఖ పేర్కొన్నారు. హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో డాగ్ అడాప్షన్ కార్యక్రమం శనివారం నిర్వహించారు. కొండా సురేఖ చేతుల మీదుగా స్వదేశి కుక్కపిల్లను మంత్రి సీతక్క అడాప్ట్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యజమానులు చనిపోతే ఆవేదనతో మృతి చెందిన కుక్కలు ఉన్నాయనిఅన్నారు. శునకాలపై అనవసరంగా దాడి చేస్తేనే అవి తిరిగి దాడికి పాల్పడతాయన్నారు. తన ఇంటి చుట్టూ నిత్యం తిరుగుతున్న కుక్కలను కేవలం స్టెరిలైజ్ చేసి వదిలేయాలని సూచించినట్లు తెలిపారు. ఎంతో విశ్వాసంతో మెలిగే శునకం యజమానికి రక్షణగా నిలుస్తుందన్నారు. ఇంట్లో కుక్క ఉంటే మనిషితో సమానమని అన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ కుక్క పిల్లలను దత్తత తీసుకొని ఆదర్శంగా నిలవాలని సూచించారు.
మంత్రి సీతక్క మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అహింసా సిద్ధాంతాన్నే అనుసరించిందని స్పష్టం చేశారు. అహింసా మార్గంలోనే దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తుచేశారు. ప్రతి ప్రాణికీ జీవించే హక్కు ఉందని, విశ్వాసానికి మారుపేరు కుక్క అని ఆమె అన్నారు. ఇంట్లో ఒక డాగ్ ఉంటే భద్రతా భావం కలుగుతుందని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదని తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు సర్పంచ్లు కుక్కలను చంపిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఆ సంఘటనలను ప్రభుత్వం ఖండించిందని, సంబంధిత వారిపై చర్యలు కూడా తీసుకున్నామని తెలిపారు.
Also Read: GHMC: కొత్త మున్సిపల్ కార్పొరేషన్లకు కష్టాలు.. చిక్కులు తప్పవంటూ నిపుణులు హెచ్చరికలు..!
అలాంటి తప్పులను ప్రభుత్వానికి అంటగట్టడం భావ్యం కాదని, పార్లమెంట్లో లేదా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. ఎవ్వరూ కూడా కుక్కలను చంపకూడదని, నియంత్రణ చర్యలు పాటిస్తూ మానవత్వంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు.అందరూ ఇండియన్ డాగ్స్ను అడాప్ట్ చేసుకోవాలని కోరారు. మనుషుల మధ్య అప్పుడప్పుడూ మానవత్వం లోపిస్తోందని, రక్త సంబంధాలు కూడా మరచి ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే పరిస్థితులు వస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇంటి కుక్క మాత్రం ఎప్పుడూ తన యజమానిని హాని చేయదని, విశ్వాసంతో కాపాడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీ రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మాజీ కార్పొరేటర్ విజయా రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Saraswati Movie: ‘సరస్వతి’ ఫస్ట్ లుక్ చూశారా!.. లేడీ విలన్ దర్శకురాలు ఇరగదీసిందిగా..