Corporation Chairman: స్వేచ్ఛ బ్యూరో: ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్లలో పదవి టెన్షన్ మొదలైంది. గత ఏడాది మార్చి 14 ప్రభుత్వం 37 మందికి కార్పొరేషన్ చైర్మన్ లుగా అవకాశం కల్పించింది. మరో మూడు రోజుల్లోనే రెండేళ్ల కాల పరిమితి పూర్తి కానున్నది. దీంతో తమ పదవులను ప్రభుత్వం పొడిగిస్తుందా? లేదా? అని ఆయా లీడర్లు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. కొత్త వారికి అవకాశం కల్పిస్తూ పక్కన పెడుతుందెమోననే భయం కూడా అందరిలోనూ నెలకొన్నది. ఇప్పటికే పలువురు నేతలు తమ పదవులను కాపాడుకునేందుకు పైస్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టారు. సీఎం, మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, సీనియర్ ఎమ్మెల్యేలతో సిఫారసులు చేయించుకుంటున్నట్లు తెలిసింది. వాస్తవానికి గతంలోనే ముఖ్యమంత్రి ఈ విషయంలో ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చారు. కార్పొరేషన్ చైర్మన్ల పనితీరు, ప్రజల్లోకి ప్రభుత్వ పథకాలను తీసుకెళ్లిన తీరు, వారి శాఖా పరమైన అభ్యున్నతిని పరిగణనలోకి తీసుకుని మాత్రమే పొడిగింపు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో కొందరి చైర్మన్లకు టెన్షన్ పట్టుకున్నది. ఇప్పటికే ప్రతి కార్పొరేషన్ సాధించిన పురోగతిపై ఇంటెలిజెన్స్, పార్టీ అంతర్గత సర్వేల ద్వారా సీఎం సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఏ చైర్మన్ తన పదవికి న్యాయం చేశారు? ఏ కార్పొరేషన్ నిధుల వినియోగంలో, సంక్షేమ పథకాల అమలులో ముందుంది? అనే అంశాలను ప్రాధాన్యత క్రమంలో పరిశీలిస్తున్నారు.
పదవిలో కొనసాగాలని ఆశిస్తున్న చైర్మన్లు ఇప్పటినుంచే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తమ జిల్లా మంత్రుల ద్వారా సీఎంకు సిఫార్సు చేయించుకునే పనిలో పడ్డారు.ఈ మేరకు గత రెండేళ్లలో తాము చేసిన పనులను వివరిస్తూ ప్రత్యేకంగా నివేదికలను సిద్ధం చేసుకుని అధిష్టానం వద్దకు వెళ్తున్నారు.ఇటు పార్టీ, అటు ప్రభుత్వం పెద్దల ఇళ్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ప్రభుత్వ సర్వేల్లో సుమారు 50 శాతం చైర్మన్లపై సీఎం అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. ఆశీంచిన స్థాయిలో పనిచేయలేదనే అభిప్రాయంలో ఉన్నారు. పార్టీ యాక్టివిటీస్, ప్రభుత్వ పనితీరును జనాల్లోకి తీసుకువెళ్లడంలో కొందరు కార్పొరేషన్ చైర్మన్లు విఫలమయ్యారనే అభిప్రాయం కూడా ఉన్నది. ఇక ఆయా శాఖల్లోనూ చైర్మన్ల మార్క్ పెద్దగా కనిపించలేదు. దీంతో తొలి విడత రిక్రూట్ చేసిన చైర్మన్లలో మెజార్టీ నేతలకు రెన్యువల్స్ ఉండవనే గాంధీభవన్ వర్గాల నుంచి తెలిసింది.
Also Read: Kavitha Kalvakuntla: వెలుగుమట్ల భూ పోరాటం.. దీక్ష విరమించిన కవిత.. ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్!
గతంలో పోల్చితే ఈ సారి కార్పొరేషన్ చైర్మన్ లక పుల్ డిమాండ్ నెలకొన్నది. గతంలో పోటీ చేసి ఓడిపోయినట్లు, పార్టీ కోసం మొదట్నుంచి పనిచేస్తున్నోళ్లు, మంత్రుల అనుచరులు తదితరులంతా చైర్మన్ పోస్టుల కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి, ఇప్పటివరకు ఎలాంటి పదవులు పొందని ద్వితీయ శ్రేణి నాయకులకు ఈసారి అవకాశం కల్పించాలని ప్రభుత్వం యోచిస్తోంది.దీంతో పదవి పొందిన తర్వాత శాఖా పరమైన వ్యవహారాల్లో పెద్దగా చొరవ చూపని వారిని, వివాదాల్లో చిక్కుకున్న వారిని తప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.ఇప్పటికే కొందరు చైర్మన్లు తమకు సంబంధించిన సామాన్లు సర్దుకునే పనిలో కూడా ఉన్నట్లు తెలిసింది. రాబోయే ఎన్నికలు, స్థానిక రాజకీయ సమీకరణాలు, పార్టీ బలోపేతం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కార్పొరేషన్ చైర్మన్లను నియమించే ఛాన్స్ ఉన్నది.
Also Read: Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో అసలేం జరుగుతుంది? న్యూ డౌట్స్ స్టార్ట్స్!