Hyderabad News: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనే మొట్టమొదటి ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ పార్కింగ్ వ్యవస్థను హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి తెచ్చారు. జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ సమీపంలో గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ నేడు ప్రారంభమైంది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఈ పార్కింగ్ వ్యవస్థను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ శ్రీలత, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్, స్థానిక కార్పొరేటర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ అత్యాధునిక సదుపాయం ద్వారా కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో నెలకొన్న శాశ్వత పార్కింగ్ సమస్యకు పరిష్కారం లభించినట్లు అయింది.
ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ను GHMC పర్యవేక్షణలో నవనిర్మాణ్ అసోసియేట్స్ సంస్థ నిర్మించింది. ఇది ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ కార్ పార్కింగ్ పద్ధతిలో పనిచేస్తుంది. ఇప్పటికే ఈ వ్యవస్థకు సంబంధించిన ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఈ స్మార్ట్ రోటరీ పార్కింగ్లో ఒకేసారి 72 కార్లను సులభంగా పార్కింగ్ చేసుకునే సదుపాయం ఉంది. నవనిర్మాణ్ అసోసియేట్స్ ఈ ప్రాజెక్ట్ను ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్ఫర్’ (DBFOT) మోడల్లో నిర్వహించనుంది.
ఈ అత్యాధునిక పార్కింగ్ వ్యవస్థ కేవలం కేబీఆర్ పార్కుకు వాకింగ్ కోసం ఉదయం, సాయంత్రం వేళల్లో వచ్చేవారికి మాత్రమే కాక, చుట్టుపక్కల నివాసం ఉండే వారికి కూడ ఉపయోగకరంగా ఉంటుంది. వాహనదారులు తమ కార్లను ఇక్కడ సురక్షితంగా, సౌకర్యవంతంగా పార్క్ చేసుకోవచ్చు. నగరంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, స్థలాభావం దృష్ట్యా ఇలాంటి ఆటోమేటెడ్ పార్కింగ్ వ్యవస్థలు ఎంతో అవసరం. కేవలం తక్కువ స్థలంలో ఎక్కువ కార్లను పార్క్ చేయగల సామర్థ్యం ఈ రోటరీ విధానం ప్రత్యేకత
త్వరలో మొబైల్ యాప్ సేవలు..
ఈ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్వహణను చూస్తున్న నవనిర్మాణ్ అసోసియేట్స్ సంస్థ త్వరలోనే ఒక ప్రత్యేకమైన మొబైల్ యాప్ను తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు ముందుగానే తమ పార్కింగ్ స్లాట్ను బుక్ చేసుకోవచ్చు. అంతేకాక, నావిగేషన్ సేవలు, ఇతర అనుబంధ సేవలు కూడ ఈ మొబైల్ అప్లికేషన్ ద్వారా అందుబాటులోకి వస్తాయి. ఈ సాంకేతికత వినియోగం ద్వారా పార్కింగ్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. హైదరాబాద్ నగరంలో పార్కింగ్ సౌకర్యాలను మెరుగుపరచడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించవచ్చు.
ALSO READ: Telangana Cabinet: ఆ మంత్రులకు బిగ్ షాక్..! కేబినెట్లోకి విజయశాంతి, రాజగోపాల్ రెడ్డి..?