Mahesh Kumar: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో సర్పంచులు లేక పాలన కుంటుపడిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల కారణంగానే తాము ఎన్నికలకు సిద్ధమయ్యామని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్కు పూర్తిగా కట్టుబడి ఉందని మహేష్ కుమార్ గౌడ్ బలంగా చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల గానీ పార్టీ పట్ల గానీ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ఆయన నొక్కి చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీ రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని ఆయన ప్రకటించారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్ అంశాన్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటోందని ఆయన ఆరోపించారు. బీసీ సంఘాలు ఈ విషయంపై లోతుగా ఆలోచించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బీసీ రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా ప్రయత్నాలు చేసిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషిని ఆయన వివరించారు.
బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే పది లక్షల నజరానా ఇస్తామన్న వ్యాఖ్యలపై మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక సంస్థల్లో బీజేపీ గెలవడం అనేది అదొక కళా అనే విధంగా ఆయన ఎద్దేవా చేశారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేశారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో తొంభై శాతం పైగా కాంగ్రెస్ అభ్యర్థులే గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
చివరగా పార్టీకి కష్టకాలంలో అండగా నిలబడిన వారికే ఈ ఎన్నికల్లో పదవులు దక్కుతాయని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. పార్టీ పట్ల విధేయత నిబద్ధత ఉన్న నాయకులకు కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో ఉన్న నమ్మకానికి ఈ ఎన్నికలు నిదర్శనమవుతాయని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరోసారి రుజువు చేస్తాయి
ALSO READ: NSN Infotech: హైదరాబాదులో బోర్డు తిప్పేసిన మరో ఐటీ కంపెనీ.. రోడ్డున పడ్డ 400 మంది నిరుద్యోగులు