BJP : ఆ ఒక్కటీ అడక్కు. తెలంగాణ బీజేపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. పార్టీకి కొత్త అధ్యక్షుడు ఎవరు? ఎప్పుడు వస్తారు? అంటే ఆన్సరే లేకుండా పోయింది. అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు లేట్ చేస్తూనే ఉన్నారు. బండి నుంచి ఈటల వరకు వినిపించిన పేర్లే మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. మధ్యలో ఎమ్మెల్యే రాజాసింగ్ చేసే రచ్చ మామూలుగా లేదు. కిషన్రెడ్డి టార్గెట్గా రోజుకో డైలాగ్తో కాక రేపుతున్నారు. రాజాసింగ్ను పార్టీ నుంచి గెంటేస్తారంటూ ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం గట్టి పిండమే అన్నట్టు కొట్లాడుతున్నారు. బీజేపీలో ఈ ఇంటి పోరు అంతా అధ్యక్ష పీఠం కోసమే అనేది అందరికీ తెలిసిందే. మరి, ఆ అధినేత ఎవరో తేల్చే సమయం వచ్చేసింది. తెలంగాణ బీజేపీలో ఈ ఆదివారం రెండు కీలక పరిణామాలు జరగనున్నాయి.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు రంగం సిద్ధమైంది. ప్రెసిడెంట్ ఎలక్షన్కు ఆదివారం నోటిఫికేషన్ విడుదల కానుంది. సోమవారం అశావహుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. జులై 1న ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర అధ్యక్షుడిని అధికారికంగా ప్రకటించనున్నారు. ఢిల్లీ నుంచి షీల్డ్ కవర్ సెలక్షన్ కాకుండా.. ఎలక్షన్తో పార్టీ చీఫ్ను ఎన్నుకోవడం ఆసక్తికరంగా మారింది. మరి, బీజేపీ కొత్త బాస్ ఎవరు? బండి సంజయా? ఈటల రాజేందరా? ధర్మపురి అర్విందా? రఘునందన్రావా? కిషన్రెడ్డినే మళ్లీ అవుతారా? లేదంటే.. ఏకంగా రాజాసింగే రేసులోకి వస్తారా? అనే కుతూహలం పెరిగింది.
ఇప్పటికే బీజేపీలో బూత్ స్థాయి, మండల, జిల్లాల అధ్యక్షుల ఎన్నిక ప్రక్రియ పూర్తి అయ్యింది. జూన్ 30న తెలంగాణకు సంస్థాగత ఎన్నికల రాష్ట్ర ఇంచార్జ్ శోభా కరండ్లాజే రానున్నారు. జూలై 1న జరిగే ఎన్నికల తర్వాత.. అదే రోజు గెలిచిన అధ్యక్షుడిని ప్రకటించే ఛాన్స్ ఉంది.
ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. నిజామాబాద్లో పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. సాయంత్రం తిరుగు ప్రయాణంలో.. బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం కానున్నారు. ఇదే మీటింగ్లో బీజేపీ స్టేట్ చీఫ్ ఎవరనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పేరుకు ఎన్నికల పోటీయే అయినా.. షా ఎంపికే స్టేట్ ప్రెసిడెంట్ను డిసైడ్ చేస్తుందనేది ఓపెన్ సీక్రెట్.