Three Women Died in Road Accident : ట్రాక్టర్ బోల్తా పడి ముగ్గురు మహిళలు మరణించారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మియాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్న బొకూర్ గ్రామానికి చెందిన మల్యాల వెంకటేశ్ అనే వ్యక్తి మియాపూర్ గ్రామం చివరిలో తనకు ఉన్న వ్యవసాయ భూమిలో మొక్కజొన్న కంకుల పొట్టు తీసేందుకు తన భార్య సహా.. 8 మంది మహిళా కూలీలను ట్రాక్టర్ లో తీసుకెళ్లారు.
పొలం పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా.. ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో పోచంపల్లి రాజమ్మ, భేతి లక్ష్మి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. వెంకటేశ్ భార్య అయిన వైష్ణవి తీవ్రగాయాల పాలవ్వగా.. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించింది. మిగతా కూలీలకు సైతం గాయాలవ్వడంతో వాళ్లందరినీ కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.