High Temperature Recorded in Andhra Pradesh and Telangana: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర వడగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. దీంతో బయటకు రావాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. భానుడి భగ..భగతో తెలుగు రాష్ట్రాలు నిప్పులకొలిమిగా మారాయి. సూరీడు తగ్గేదేలే అంటూ నిప్పులు చెరుగుతున్నాడు. రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలతో ఏపీ, తెలంగాణ అగ్నిగుండంలా మారాయి.
ఏ రోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా మునుగోడులో ఏకంగా 46.6 డిగ్రీలు నమోదైంది అంటే అర్థం చేసుకోవచ్చు.. ఎండలు ఏ రేంజ్లో మండిపోతున్నాయో. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. గతేడాది కన్నా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు వడగాలులు, ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు.
హైదరాబాద్లోనూ అదే స్థాయిలో 43 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండతీవ్రతతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. మరోవైపు.. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజుల్లో మరింతగా ఎండలుంటాయని చెబుతున్నారు.
Also Read: కవితకు దక్కని ఊరట, మళ్లీ మే ఆరుకు వాయిదా
ఏపీలోనూ ఎండలు ఠారెత్తిస్తోన్నాయి. పలు జిల్లాలో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాలులు వీస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. 5 తేదీ వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని అధికారులు హెచ్చరిస్తోన్నారు.ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోన్నారు.