Mahesh Goud: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్ర కేబినెట్లో మంత్రి పదవి కంటే పీసీసీ అధ్యక్ష పదవిలోనే తనకు ఎక్కువ సంతృప్తి, గర్వం ఉన్నాయని టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్ చాట్లో ఆయన పలు రాజకీయ, సామాజిక అంశాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని “నికార్సైన కాంగ్రెస్ లీడర్” గా అభివర్ణించిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడుతుందని స్పష్టం చేశారు.
బండి సంజయ్ కుమారుడి కేసులో జాప్యం లేదన్నారు.కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపై నమోదైన కేసు విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా ఉందని మహేష్ గౌడ్ తెలిపారు. “బండి సంజయ్ కొడుకుని తప్పించాల్సిన అవసరం మాకు లేదు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. బాధితురాలికి కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆమెకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది,” అని పీ సీసీ చీఫ్ ఆయన హామీ ఇచ్చారు. నిందితుడు అప్స్కండింగ్ అయినట్లు వెలిసిన పోస్టర్ల గురించి తమకు సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు.
Also read: గచ్చిబౌలిలో దారుణం.. లిఫ్ట్లో ఇరుక్కుని పసిపాప మృతి!
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీరుపై మహేష్ గౌడ్ విమర్శలు గుప్పించారు. ప్రజలు కేసీఆర్కు ప్రతిపక్ష పాత్ర ఇస్తే, ఆయన మాత్రం ఫామ్ హౌజ్కే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వాడుతున్న భాష అత్యంత దారుణంగా ఉందని మండిపడ్డారు. అదేవిధంగా, రాష్ట్రంలో బీజేపీబలహీనపడిందనే విషయం మోదీకి అర్థమైందని, అందుకే ఆయన పదేపదే తెలంగాణకు వస్తున్నారని విశ్లేషించారు. మరో వైపు గత 12 ఏళ్లుగా పొదుపు గురించి మాట్లాడని మోదీ, ఇప్పుడు మాట్లాడుతున్నారని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా, దేశంలో పెట్రోల్ ధరలు పెంచడమే మోదీ ప్రభుత్వ విధానమని ఆరోపించారు.
బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ సెక్యులర్ ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని మహేష్ గౌడ్ ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినా కాంగ్రెస్కు వచ్చే నష్టమేమీ లేదని, ఆ కూటమి ఓట్ల శాతం 30 దాటదని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో కమ్యూనిస్టులు అంతరించిపోయారని అనుకోవడం పొరపాటని, వారు ఇంకా సజీవంగానే ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.ఇక రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా పంటలు పండాయని, దిగుబడి ఎక్కువగా ఉండటం వల్లే సేకరణలో స్వల్ప ఆలస్యం జరిగిందని వివరించారు. తాము ఉద్యమకారులను, ప్రతిపక్ష నేతలను ఎల్లప్పుడూ గౌరవిస్తామని, గతంలో భట్టి విక్రమార్క ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ వారిని గౌరవించలేదని గుర్తు చేశారు. పార్టీ బాధ్యతల్లో తాను అత్యంత సంతోషంగా ఉన్నానని చెబుతూనే, రాబోయే రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు.
Also read: దౌల్తాబాద్లో దారుణం.. అప్పు పేరుతో అర్దరాత్రి పండించిన పంట చోరీ!