నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో తెలంగాణకు అన్యాయం చేసే కుట్ర జరుగుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని హెచ్చరిస్తూ గురువారం ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ కు అసలు సంబంధం ఏమిటని ఆమె ప్రశ్నించారు. మహిళా బిల్లు ఎప్పుడో ఆమోదం పొందిందని గుర్తుచేశారు. డీలిమిటేషన్ అలాగే మహిళా బిల్లు రెండూ వేర్వేరు అంశాలని స్పష్టం చేశారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పార్లమెంట్ లో తెలంగాణ రాజకీయ ప్రాతినిధ్యం 3.13% గా ఉందని కవిత పేర్కొన్నారు. డీలిమిటేషన్ ప్రక్రియలో ఏ ప్రాతిపదికను తీసుకున్నా సరే తెలంగాణ ప్రాతినిధ్యం ఏ మాత్రం తగ్గకూడదని తేల్చి చెప్పారు. దేశవ్యాప్తంగా సీట్లను 50% పెంచుతామనే ప్రతిపాదన శాస్త్రీయంగా లేదన్నారు. ఉదాహరణకు బీహార్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో పెరిగే సీట్ల సంఖ్యకు చాలా అంతరం ఉంటుందని వివరించారు. దీనివల్ల జాతీయ రాజకీయాల్లో తెలంగాణ ప్రాధాన్యత భారీగా తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల వల్ల కేవలం ఉత్తరాది పెద్ద రాష్ట్రాలకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందని విమర్శించారు. ఇప్పటికే నిధుల కేటాయింపులోనూ జాతీయ ప్రాజెక్టుల హోదా విషయంలోనూ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రాతినిధ్యం తగ్గితే ఈ వివక్ష మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. అవసరమైతే తెలంగాణ సాధన ఉద్యమ తరహాలో మరో భారీ ఉద్యమాన్ని చేపడతామని కేంద్రానికి అల్టిమేటం ఇచ్చారు. మహిళా బిల్లుకు డీలిమిటేషన్ లింక్ చేయడాన్ని తప్పుబట్టిన ఆమె కేంద్రానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే మహిళా బిల్లులో బీసీ సబ్ కోటాను చేర్చాలని సూచించారు. అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న ఆర్టిజన్లపై విద్యుత్ సంస్థల యాజమాన్యాలు బెదిరింపులకు దిగడంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లోంచి తొలగిస్తామంటూ కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం వారి ప్రాథమిక హక్కులను హరించడమేనని మండిపడ్డారు. ఆర్టిజన్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వారికి తెలంగాణ జాగృతి ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల ప్రజలను వంచిస్తోందని ఆమె విమర్శించారు. ప్రజల గొంతుకను నొక్కే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.
ALSO READ: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు నో వర్రీ: ప్రధాని మోదీ