Phone Tapping Case: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ టి. ప్రభాకర్ రావు విచారణలో వేగవంతం అయ్యింది. ఆయనను మరో వారం రోజుల పాటు పోలీసు కస్టడీలో విచారించేందుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. దర్యాప్తు సంస్థలు తమ వ్యూహాలకు పదును పెట్టాయి.
ఈ నేపథ్యంలోనే.. కేసు లోతు పాతులను వెలికితీసేందుకు తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 9 మంది కీలక అధికారులతో కూడిన ఈ సిట్, ప్రభాకర్ రావును అన్ని కోణాల్లో ప్రశ్నించనుంది.
సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు..
ఈ సిట్ ఇన్చార్జిగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ను నియమించారు. సజ్జనార్ గతంలో కీలక కేసులను ఛేదించిన అనుభవం ఉండటంతో.. ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా ఆయన నేతృత్వంలో విచారణ పకడ్బందీగా సాగుతుందని భావిస్తున్నారు. ఈ బృందంలో ఐదుగురు ఐపీఎస్ అధికారులతో పాటు ముగ్గురు అడిషనల్ డీసీపీలు, ఒక ఏసీపీ స్థాయి అధికారులు సభ్యులుగా ఉన్నారు.
దర్యాప్తును వేగవంతం చేసేందుకు కమిషనర్ సజ్జనార్ ఇప్పటికే సిట్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రభాకర్ రావు నుంచి రాబట్టాల్సిన సమాచారం, నిక్షిప్తమైన డేటా పునరుద్ధరణ వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం రోజుల పాటు సాగనున్న ఈ కస్టడీ విచారణలో సిట్ అధికారులు తమదైన శైలిలో విచారణ జరిపేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై దృష్టి సారించనున్నారు.
ఎవరి ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ జరిగింది..? ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరెవరికి చేరవేశారు..? ఎన్నికల సమయంలో నగదు తరలింపులో ఈ సమాచారం ఎలా ఉపయోగపడింది..? రికార్డులు, హార్డ్ డిస్క్ల ధ్వంసం వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు..? అనే అంశాలపై సిట్ బృందం విచారణ చేయనుంది.
ప్రభాకర్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఈ కేసులో మరిన్ని కీలక పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులు జైలులో ఉండగా, ప్రభాకర్ రావు విచారణ అనంతరం మరికొందరు రాజకీయ నేతలు లేదా అధికారుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. కస్టడీ గడువు ముగిసిన తర్వాత ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో సిట్ దర్యాప్తు నివేదిక అత్యంత కీలకం కానుంది.
ALSO READ: Vijayawada Crime: మద్యం తాగేందుకు రూ.10 ఇవ్వలేదని.. వృద్ధుడిని హత్య చేసిన బాలుడు