Drugs: డిసెంబర్ 31st నైట్. అంతా ఫుల్ ఎంజాయ్ చేశారు. ఘనంగా కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. డ్రంకెన్ డ్రైవ్ కేసులు గట్రా వచ్చినా.. అంతా సాఫీగా జరిగిపోయింది. కానీ, ఆ రోజు అర్థరాత్రి చీకటి నీడన డ్రగ్స్ దందా జోరుగా సాగిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. కొన్ని క్లబ్బుల్లో డ్రగ్స్ గబ్బు రేపారని పోలీసుల తనిఖీల్లో తేలింది. డ్రగ్స్ కేసుతో సంబంధమున్న ఇద్దరు పాత నేరస్తులను పట్టుకున్నారు పోలీసులు. వారి నుంచి 3 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.
ఎఫ్ హౌజ్. జూబ్లీహిల్స్ మెయిన్ రోడ్డునే ఉంటుంది. డిసెంబర్ 31 మిడ్ నైట్.. అది డ్రగ్స్ కు అడ్డాగా మారిందని పోలీసులు అంటున్నారు. ఎఫ్ హౌజ్ కేంద్రంగానే ఇద్దరు నిందితులు మైరాన్ మోహిత్ అగర్వాల్, మన్యం కృష్ణకిషోర్ రెడ్డిలు డ్రగ్స్ దందా నడిపించారని చెబుతున్నారు. డిసెంబర్ 31న ఎఫ్ హౌజ్ కు వచ్చిన వారి లిస్టు బయటకు తీస్తున్నారు పోలీసులు.
మోహిత్, కృష్ణకిషోర్ రెడ్డిలపై నవంబర్ 3న రాంగోపాల్ పేట్లో ఓ డ్రగ్స్ కేసు నమోదైంది. కేసు నమోదు అయినప్పటి నుంచి వాళ్లిద్దరూ పరారీలో ఉన్నారు. లేటెస్ట్ గా, హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ పోలీసులతో కలిసి రాంగోపాల్ పేట్ పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు.
మైరాన్ మోహిత్ అగర్వాల్. మహా కిలాడీ. ఇంటర్నేషనల్ డీజే ఈవెంట్లు అరేంజ్ చేస్తుంటాడు. ముంబై, గోవా, హైదరాబాద్, బెంగళూరులో పార్టీలు నిర్వహిస్తుంటాడు. హైదరాబాద్లోని పబ్లలో సైతం ప్రైవేట్ పార్టీలు నిర్వహిస్తున్నాడు. ఎఫ్ హౌజ్ అతని డెన్ అంటున్నారు. పార్టీల్లో కొకైన్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇతనికి డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్తో సంబంధాలు ఉన్నాయి. పలువురు టాలీవుడ్ ప్రముఖులకు మోహిత్ అగర్వాల్ డ్రగ్స్ సప్లై చేసినట్టు సమాచారం. మోహిత్ అగర్వాల్ భార్య.. సినీ నటి నేహదేశ్ పాండే. ఆమె పలు తెలుగు సినిమాల్లోనూ నటించారు. ఆమె ద్వారానే టాలీవుడ్ సెలబ్రెటీస్ కి డ్రగ్స్ అమ్మారని పోలీసుల విచారణలో తెలుస్తోంది.
పోలీసులు అరెస్ట్ చేసిన మరో నిందితుడు హైదరాబాద్లో కేఎంసీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను నడుపుతున్న మన్యం కృష్ణ కిషోర్ రెడ్డి. డ్రగ్స్ కోసం తరచూ గోవా వెళ్లి వస్తుంటాడు. ఇతనికి కూడా ఎడ్విన్తో పరిచయాలు ఉన్నాయి. బంజారాహిల్స్ లోని అతని నివాసంలో కృష్ణ కిషోర్ రెడ్డిని అరెస్ట్ చేసి.. 2గ్రాములు కొకైన్ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వీరితో సంబంధాలున్న టాలీవుడ్ ప్రముఖులు ఎవరనే దిశగానూ దర్యాప్తు జరుగుతోంది.