Kishan Reddy: రాష్ట్రానికి 2025-26 ఆర్థిక సంవత్సరంలో.. పన్నుల వాటాగా రూ.29,280 కోట్లు రాగా అది 2026-27 సంవత్సరానికి 13.5 శాతం పెరుగుదలతో రూ.33,180 కోట్లు బడ్జెట్ లో కేంద్రం కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన బడ్జెట్ పై మీడియాతో మాట్లాడారు. దేశంలో 7 హైస్పీడ్ రైల్ కారిడార్స్ ప్రకటిస్తే.. అందులో మూడు(హైదరాబాద్-పుణే, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై) హైదరాబాద్ నగరం నుంచే ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ఇది గర్వించాల్సిన విషయమన్నారు. ఈ బడ్జెట్లో ప్రకటించిన బయోఫార్మా స్ట్రాటజీ ఫర్ హెల్త్ కేర్ అడ్వాన్స్మెంట్ త్రూ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్ కార్యక్రమం ద్వారా ఫార్మా కేపిటల్ గా, వ్యాక్సిన్ క్యాపిటల్ గా ఉన్న మన హైదరాబాద్ నగరానికి చాలా మేలు జరగనుందన్నారు.
దేశవ్యాప్తంగా వికసిత్ భారత్ రూరల్ అజీవికా మిషన్ – గ్రామీణ్(వీబీ జీరామ్ జీ)కి సంబంధించిన నిధులు కూడా పెరిగాయని కిషన్ రెడ్డి వివరించారు. ఎరువుల సబ్సిడీకి నిధులు గతంతో పోలిస్తే సుమారు రూ.7 వేల కోట్లు అదనంగా కేటాయించిందని, మొత్తం రూ.1.26 వేల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం కేటాయించినట్లు చెప్పారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మెదడిసిన్(ఎస్ టీఈఎం) కోర్సుల్లో ఉన్నత విద్య చదువుతున్న యువతులు ల్యాబ్, క్లాసెస్ కు ఇబ్బంది అవుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాకు ఒక గర్ల్స్ హాస్టల్ నిర్మించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. తెలంగాణలోని 33 జిల్లాలకు ఒక్కో గర్ల్స్ హాస్టల్ రానుందన్నారు. ఏ విదేశీ కంపెనీ అయినా భారతీయ డేటా సెంటర్ల సర్వీసెస్ వాడితే ఆ కంపెనీకి 2047 వరకు ట్యాక్స్ హాలిడేను ప్రకటించారని, దీనివల్ల భారతదేశంలోని డేటాసెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన వాతావరణం సాధ్యమవుతుందన్నారు.
Also Read: Today Horoscope in Telugu: ఆ రాశి వ్యాపారులకు లాభాలు – నిరుద్యోగులకు శుభవార్తలు
ఇప్పటికే వివిధ ఎంఎన్ సీలు హైదరాబాద్, విశాఖపట్టణం, బెంగళూరుల్లో డేటాసెంటర్లు ఏర్పాటుచేస్తున్నాయని వివరించారు. ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.10వేల కోట్ల బడ్జెట్ ను ప్రకటించిందని, ఈ గ్రోత్ ఫండ్ ద్వారా తెలంగాణలో ఉన్న 38 లక్షల ఎంఎస్ఎంఈలకు కూడా మేలు జరగనుందన్నారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులు ఖర్చు పెట్టుకునే నిధులపైన పన్నును 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారన్నారు. ఈ బడ్జెట్ ఎన్నికలకోసం రూపొందించిన బడ్జెట్ కాదని కిషన్ రెడ్డి తెలిపారు. పట్టణాభివృద్ధి శాఖ వద్ద.. మెట్రో నిర్మాణంకోసం కేంద్ర ప్రభుత్వ వాటా ఇచ్చేందుకు తగినన్ని నిధులున్నాయని, అయితే ముందుగా హైదరాబాద్ మెట్రోపై.., రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పష్టత తెచ్చుకుని, ఎల్ అండ్ టీతో విలీనంపై ఏర్పాటుచేసిన కమిటీ చర్చలను పూర్తిచేసి త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇవన్నీ లావాదేవీలను పూర్తిచేసుకున్న తర్వాత సరైన డీపీఆర్ సమర్పిస్తే దానికి తగ్గట్లుగా కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే రెండేళ్లకు పైగా ఆలస్యమైందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. సీరియల్ లాగా సాగదీస్తున్నారని మండిపడ్డారు. కవిత తనతో పాటు తన భర్త ఫోన్ ట్యాప్ అయిందని ఆరోపించిందని, హైకోర్టు జడ్జీల ఫోన్లు ట్యాప్ అయ్యాయని అన్న సందర్భంలో.. ఎవరు చేశారనే దానికన్నా ప్రభుత్వం ద్వారా జరిగిందనేది వాస్తవమన్నారు. వారు, వీరు అని తేడా లేకుండా.. అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని కేంద్ర మంత్రి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిందని, చట్టం తన పని తాను చేసుకుపోవాలన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అవినీతికి కొమ్ముకాస్తున్నాయని ధ్వజమెత్తారు. రెండు పార్టీలపై ప్రజల్లో విశ్వాసం పోయిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు.. ఈ రెండు పార్టీలకు బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ కుటుంబం డబ్బుల వాటాకోసం కొట్టుకుంటుంటే.., రేవంత్ సర్కారులో మంత్రులు డబ్బుల వాటాకోసం కొట్లాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు.