Urea Black Market: స్వేచ్ఛ బ్యూరో: అన్నదాత ఆకలి తీర్చే నేలకు అండగా ఉండాల్సిన వ్యవస్థలే ఇప్పుడు రైతన్న పొట్ట కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సహకార సంఘాలు (సొసైటీలు), ప్రైవేట్ ఫర్టిలైజర్ దుకాణాలు నిబంధనలను తుంగలో తొక్కి, యూరియా విక్రయాల్లో యథేచ్ఛగా దోపిడీకి పాల్పడుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధర (MRP) కంటే అధికంగా వసూలు చేస్తూ, రైతులను నిలువు దోపిడీ చేస్తున్నా.. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తా ధర రూ. 266.50 ఉండాలి. కానీ, జిల్లాలోని ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పలు సహకార సంఘాల్లోనే బహిరంగంగా రూ. 280కి విక్రయిస్తున్నారు. అంటే ప్రతి బస్తాపై అదనంగా వసూలు చేస్తున్న ఆ రూ. 13.50 ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? క్షేత్రస్థాయిలో అక్రమాలను అరికట్టాల్సిన అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని మామూళ్ల మత్తులో జోగుతున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. యూరియా యాప్లు, ఆన్లైన్ పర్యవేక్షణ వ్యవస్థలు ఎన్ని వచ్చినా, క్షేత్రస్థాయిలో దోపిడీకి అడ్డుఅదుపు లేకుండా పోయింది. ఇక ప్రైవేట్ వ్యాపారుల ఆగడాలకైతే హద్దే లేదు; వారు ఏకంగా రూ. 300 వసూలు చేస్తూ కాసుల కక్కుర్తిని ప్రదర్శిస్తున్నారు.
జిల్లాలోని పలు మండలాల్లో యూరియా నిల్వలు పగలు, రాత్రి తేడా లేకుండా బ్లాక్ మార్కెట్కు తరలుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కృత్రిమ కొరతను సృష్టించి, అధిక ధరలకు విక్రయించేందుకు కొందరు వ్యాపారులు, సొసైటీ బాధ్యులు కుమ్మక్కయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.”సొసైటీల్లో అదనపు వసూళ్లకు పాల్పడుతున్న వారిపై తక్షణమే క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో స్పందించి, ఎంఆర్పీ ధరకే యూరియా అందేలా చూడాలి. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళనలు చేపడతాంమని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము అన్నారు.
Also read: Stress: ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా ? ఈ టిప్స్ మీకోసమే
జిల్లాలో వేల బస్తాల విక్రయాల్లో జరుగుతున్న ఈ అదనపు వసూళ్లు కోట్ల రూపాయల కుంభకోణానికి దారితీస్తున్నాయి. స్థానిక ఏడీఏ (ADA), వ్యవసాయాధికారులు (AO) కళ్ల ముందే ఇంత దోపిడీ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. జిల్లా వ్యవసాయాధికారి (DAO) కార్యాలయం కేవలం నివేదికలకే పరిమితమవుతోందని, క్షేత్రస్థాయి తనిఖీలు శూన్యమని రైతులు వాపోతున్నారు.
జిల్లా కలెక్టర్ ఈ అక్రమాలపై తక్షణమే స్పందించి, కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సొసైటీలు, ప్రైవేట్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని రైతాంగం డిమాండ్ చేస్తోంది. అక్రమాలకు పాల్పడుతున్న వారి లైసెన్సులను రద్దు చేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే రైతులకు న్యాయం జరుగుతుందని వారు కోరుతున్నారు.
Also read: Education Budget: రాష్ట్ర బడ్జెట్లో విద్యాశాఖకు రూ.26,674 కోట్లు.. గత సంవత్సరం కంటే..?