Irrigation Projects: స్వేచ్ఛ బ్యూరో: బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని జకోరా, చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాలు పూర్తి అయ్యే దశకు చేరుకున్నాయని త్వరలో వీటిని ప్రారంభించనున్నట్లు మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియా ప్రకటన విడుదల చేశారు. త్వరితగతిన ఈ ఎత్తిపోతల పధకాలు పూర్తి కావడం తనకు ఎంతో సంతృప్తి నిచ్చిందన్నారు.రూ.106.04 కోట్లతో చేపట్టిన ఈ ఎత్తిపోతల పథకాలతో నిజామాబాద్ జిల్లాలోని వర్ని, చందూర్, మొస్రా మండలాల పరిధిలోని 7,975 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని తెలిపారు.
వచ్చే ఖరీఫ్ నాటికి సాగునీరు అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ఆయన తెలిపారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు వేగవంతం చేసినట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువ నుండి జకోరా ,చందూర్,చింతకుంట ఎత్తిపోతల పధకాల ద్వారా నీటి పంపిణీ ఉంటుందని వివరించారు. ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన పంప్ హౌస్ లకు 2.93 మేఘావాట్ల విద్యుత్ వినియోగం ఉంటుందని,తద్వారా నీటి పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read: గంజాయి అడ్డాలో గ్యాస్ సిలిండర్లు కలకలం
ఈ ఎత్తిపోతల పథకాలతో ఇప్పటికే ఉన్న ఆయకట్టును స్టీరికరించడంతో పాటు అదనంగా కొత్త ఆయకట్టుకు సాగు నీరు అందించడం చెరువులు కుంటలు నింపి భూగర్భ జలాలను పెంపొందించాలన్నది ప్రభుత్వ సంకల్పమన్నారు. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పధకాలను ట్రయిల్ రన్ నిర్వహించినట్లు తెలిపారు. ఈ పథకాలు ప్రారంభోత్సవం అయితే ధాన్యం దిగుబడి పెరగడంతో పాటు, పంటల భద్రత ఇనుమడింప చేస్తుందన్నారు. రైతుల అభ్యున్నతికి సాగునీటి విస్తరణకు కాంగ్రెస్ పార్టీ అంకిత భావంతో పనిచేస్తుందని త్వరలోనే ఈ పధకాలు ప్రారంభించి రైతులకు అంకితం చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు.
Also read: అవమానాలకు అడ్డ బీఆర్ఎస్ పార్టీ: ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి