తెలంగాణ రాష్ట్రంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాల పరిధిలోని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో పూర్తిస్థాయి విశ్వాసం ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సాగుతున్న తమ ప్రభుత్వం, ప్రతి గడపకూ పథకాలను చేరవేసిందని ఆయన తెలిపారు. ‘కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలన చూసి ప్రజలు ముగ్ధులవుతున్నారు. అందుకే రాబోయే ఎన్నికల్లో మాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు’ అని ఉత్తమ్ అన్నారు. మరోవైపు, ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలకు ప్రజల వద్దకు వెళ్లి చెప్పుకోవడానికి ఒక్క సాకు కూడా లేదని ఆయన విమర్శించారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకుని మున్సిపాలిటీల్లో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వివరించారు. అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలు అందాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని, అందులో భాగంగానే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశామని ఆయన గుర్తుచేశారు. ఈ పథకాల పట్ల ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని వెల్లడించారు.
దేశంలోనే తొలిసారిగా బీసీ వర్గాలకు సామాజిక న్యాయం చేకూర్చే ఉద్దేశంతో కులగణన సర్వే చేపట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ వైఖరిని ఆయన తప్పుపట్టారు. ‘కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణన ఎందుకు చేపట్టడం లేదు? దీనిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణకు అనేక విషయాల్లో తీవ్ర అన్యాయం చేసిందని ఆయన ఆరోపించారు.
మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై మాట్లాడుతూ, ఆశావహులు పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని సూచించారు. టికెట్ దక్కని వారు రెబల్స్గా పోటీ చేస్తే అంతిమంగా వారికే నష్టమని ఆయన హెచ్చరించారు. ‘కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం లాంటిది. ఇక్కడ వ్యక్తుల కంటే పార్టీ గుర్తు ‘చేయి’ ముఖ్యం. ప్రజలు పార్టీ సిద్ధాంతాలను, గుర్తును చూసే ఓటు వేస్తారు’ అని వ్యాఖ్యానించారు.
రానున్న మున్సిపల్ ఎన్నికలే కాకుండా..2028లో జరిగే శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు.
ALSO READ: Municipal elections 2026: త్రిముఖ పోరులో ‘హస్తం’ హుందాతనం వెనుక.. అసలు మతలబు ఇదేనా..