తెలంగాణ బ్యూరో,స్వేచ్ఛ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం నుంచి మరో ఫీల్డు వెరిఫికేషన్ నిర్వహించేందుకు జీహెచ్ఎంసీ సన్నాహాలు చేసింది. అర్హులకు రేషన్ కార్డులను అందించేందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇప్పటికే ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లోని సమాచారాన్ని ఫీల్డు లెవెల్లో వెరిఫికేషన్, అర్హులై ఉండి, తెల్ల రేషన్ కార్డుల్లేని వారిని గుర్తించే ఈ ప్రక్రియను గురువారం నుంచి జీహెచ్ఎంసీ నిర్వహించనుంది.
సిబ్బంది నియామకం..
ఇందుకు గాను బల్దియా పరిధిలోని 30 సర్కిళ్లలో ఈ వెరిఫికేషన్ నిర్వహించేందుకు వీలుగా ఇప్పటికే అందుబాటలో ఉన్న అంగన్ వాడీ వర్కర్లతో పాటు ఆశా వర్కర్ల సేవలను వినియోగించుకోవటంతో పాటు నిత్యం క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తు ఆయా సర్కిళ్లలోని వివిధ ప్రాంతాలతో పాటు, సర్కిల్, మున్సిపల్ డివిజన్ల సరిహద్దులపై అవగాహన కల్గిన శానిటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేసే బిల్ కలెక్టర్లతో పాటు ట్యాక్స్ ఇన్ స్పెక్టర్లు, దోమల నివారణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎంటమాలజీ విభాగంలో ఫీల్డు లెవల్ డ్యూటీలు చేసే ఎంటమాలజీ ఫీల్డు అసిస్టెంట్( ఈఎఫ్ ఏ)లను నియమించినట్లు సమాచారం. వీరు చేసే ఫీల్డ్ వెరిఫికేషన్ వివరాలు, దరఖాస్తులను క్రాస్ వెరిఫై చేసిన తర్వాత ఆమోదం కోసం కమిషనర్ కు పంపేందుకు వీలుగా డిప్యూటీ కమిషనర్లను క్రాస్ వెరిఫికేషన్ ఆఫీసర్లుగా నియమించినట్లు సమాచారం.
కార్పొరేటర్ల ఆమోదం..
సిబ్బంది ప్రతి సర్కిల్ వారీగా తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారుల ముసాయిదాను తయారు చేసే సమయంలో సదరు వార్డు కమిటీ.. వార్డు కమిటీకి చైర్మన్ గా వ్యవహరించే కార్పొరేటర్ల ఆమోదం తీసుకోవాలని ఉన్నతాధికారులు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.
మొత్తం దరఖాస్తులు 10 లక్షలు..
రాష్ర్టంలో అధికార మార్పిడి జరిగి, కాంగ్రేస్ అధికార పగ్గాలు చేపట్టిన కొత్తలో నిర్వహించిన ప్రజాపాలనలో భాగంగా హైదరాబాద్ సిటీలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల నుంచి స్వీకరించిన సుమారు 10 లక్షల తెల్ల రేషన్ కార్డుల దరఖాస్తులను గురువారం నుంచి ఫీల్డు వెరిఫికేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కోసం గతంలోనే పొందుపర్చిన నియమ, నిబంధనల ప్రకారం కొత్త రేషన్ కార్డుల కోసం వెరిఫికేషన్ చేయటంతో పాటు 2014 తర్వాత జారీ చేసిన తెల్ల రేషన్ కార్డులో కొత్త పేర్లను చేర్చటం, తొలగించటం వంటి ఇతర మార్పులు కూడా చేసేలా ఈ వెరిఫికేషన్ నిర్వహించాలని ఆదేశాలున్నట్లు తెలిసింది. కానీ కొద్ది రోజుల క్రితం వరకు కుల గణన, ఆ తర్వాత ఇందిరమ్మ ఇండ్ల సర్వే వంటివి నిర్వహించిన బల్దియా సిబ్బందికి ఇపుడు మరో వెరిఫికేషన్ బాధ్యతలను అప్పగించటం, ఇప్పటి వరకు కుల గుణన సర్వే విధులు నిర్వర్తించిన కొందరు ఎన్యుమరేటర్లకు ఇంకా వేతనం చెల్లించకపోవటం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: 140 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ స్వార్థం లేకుండా పని చేస్తోంది: సీఎం రేవంత్ రెడ్డి