Yadadri News: యాదాద్రి భువనగిరి జిల్లాలో ఓటు హక్కు ప్రాముఖ్యతపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో, డబ్బు మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా.. గ్రామాభివృద్ధి కోసం నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకునే దిశగా ఓటర్లను చైతన్యపరచడం ఈ కార్యక్రమాల లక్ష్యం…
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న ఆరు మండలాల్లో శుక్రవారం ఉదయం ఓటు హక్కుపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలో.. జిల్లా కలెక్టర్ బొమ్మల రామారం మండల కేంద్రంలో మహిళా ఓటర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఓటు శక్తి దేశ ప్రగతికి, గ్రామాభివృద్ధికి ఎంత ముఖ్యమో వివరించారు. ఒక్కరోజు నాయకులు ఇచ్చే డబ్బుకు కాక, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
అవగాహన సదస్సు ముగింపులో.. కలెక్టర్ మహిళా ఓటర్లందరితో ప్రతిజ్ఞ చేయించారు. ‘మా ఓటును గ్రామాభివృద్ధికి మాత్రమే వినియోగిస్తాం. డబ్బుకు, మద్యానికి మా ఓటును అమ్ముకోం. స్వచ్ఛందంగా.. నీతి నిజాయితీతో గ్రామాన్ని అభివృద్ధి చేసే నాయకుడిని ఎన్నుకునేందుకు మా ఓటును ఉపయోగిస్తాం’ అని మహిళలు ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ కార్యక్రమం ఓటర్లలో నూతన ఉత్తేజాన్ని, నిబద్ధతను కలిగించింది.
కలెక్టర్ నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమం జలాలపూర్ గ్రామ ఓటర్లలో అద్భుతమైన మార్పును తీసుకొచ్చింది. బొమ్మల రామారం మండలం పరిధిలోని జలాలపూర్ గ్రామానికి చెందిన కొందరు ఓటర్లు తమ ఇళ్ల ముందు బోర్డులను ఏర్పాటు చేశారు. ‘మా ఓటును డబ్బులు, గిఫ్ట్లకు అమ్ముకోము. మా ఓటు గ్రామాభివృద్ధికి. ఒక్కరోజు నాయకులు ఇచ్చే డబ్బుకు కాదు’ అని స్పష్టంగా బోర్డులపై రాశారు.
నీతి నిజాయితీతో స్వచ్ఛందంగా ఓటు వేస్తామని కూడా ప్రకటించారు. ఓటును అమ్ముకోబోమని ఓటర్లు తమ ఇళ్ల ముందు బోర్డులు పెట్టి తమ నిబద్ధతను చాటుకోవడం జిల్లా ఎన్నికల అధికారులను, కలెక్టర్ను సంతోషపరిచింది. ఇది ఎన్నికల ప్రక్రియలో ఒక శుభపరిణామంగా అధికారులు అభివర్ణించారు. ఈ చర్య ఇతర గ్రామాల ఓటర్లకు ఆదర్శంగా నిలిచి, మరింత మందిని చైతన్యపరుస్తుందని కలెక్టర్ హనుమంత రావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ALSO READ: KCR: పంచాయతీ ఎన్నికలు.. కేసీఆర్ ఆన్ యాక్షన్