చాలా రోజుల తర్వాత మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయటకు వచ్చేందుకు సిద్దమయ్యారు. ఈనెల 20న జగిత్యాల వేదికగా ఓ భారీ బహిరంగ సభను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దీనికి హాజరయ్యేందుకు కేసీఆర్ వస్తుండగా.. అదే వేదికలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకుంటారని సమాచారం.ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ర ప్రెసిడెంట్ కేటీఆర్.. జగిత్యాల వెళ్లి ఆయన్ను కలిసి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. అందుకు మాజీ మంత్రి సైతం సుముఖత వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరడానికి ముందే జీవన్ రెడ్డి నిన్న కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయనతో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు తన రాజకీయ భవిష్యత్ గురించి గులాబీ అధినేతతో సుదీర్ఘ మంతనాలు జరిపినట్టు సమాచారం. కేసీఆర్ భరోసా మేరకు ఈనెల 20న గులాబీ పార్టీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్ధమైనట్టు తెలుస్తోంది. కేసీఆర్తో భేటీ అనంతరం మాజీమంత్రి మీడియా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.కాగా, జీవన్ రెడ్డి కాంగ్రెస్ను వీడటంతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు లైన్ క్లియర్ అయ్యిందని..అధికార పార్టీలో ఇక ఆయనకు ఎలాంటి తిరుగులేదని స్థానికంగా చర్చ జరుగుతోంది.
సర్పంచ్ ఎన్నికల సమయంలో బయటకు వచ్చిన కేసీఆర్ .. మరల ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కోసం జూబ్లీహిల్స్లోని నందినగర్లో గల తన నివాసానికి వచ్చారు.ఆ ఇంట్లోనే అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఆయన బయటకు రాలేదు. పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా ఉంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి రెండున్నరేండ్లు గడిచింది. ఇంతకాలం ప్రభుత్వ పనితీరును, జనాల సమస్యలను ఫౌంహౌస్లోనే ఉండి కేసీఆర్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు కూడా ప్రభుత్వ వ్యతిరేకతను గమనిస్తున్న ఆయన.. సరైన సమయంలో బయటకు రావాలని ఎదురుచూస్తున్నట్టు తెలిసింది.
తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి సొంత పార్టీ మీదే విమర్శలు చేసి బయటకు రావడంతో ఇదే అదునుగా భావించి ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు కేసీఆర్ బయటకు రావాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే, కేసీఆర్ వచ్చేది కేవలం జీవన్ రెడ్డి జానియింగ్ కోసమేనా? లేక ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తారా? అని చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ ఫౌంహౌస్ నుంచి బయటకు రావడం, మరల వెళ్లిపోవడం ఈ మధ్యకాలంలో కామన్ అయిపోయింది. ఆయన బయటకు వచ్చినప్పుడల్లా తెలంగాణ భవన్కు రెగ్యులర్గా వస్తారని.. రేవంత్ సర్కారును ప్రశ్నిస్తారని గులాబీ కేడర్ అనుకుంటోంది. అంతలోనే వారు నిరాశకు లోనవుతారు. కాగా, జగిత్యాల సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అని పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.