KCR : ‘కేసీఆర్ రూటే సెపరేటు. సీఎంగా ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ఎవరి మాటా వినరు. ఎవరికీ అందుబాటులో ఉండరు. గడీల నుంచి బయటకు రారు. అసెంబ్లీకి కూడా వెళ్లరు. సీఎం రేవంత్రెడ్డి ఎన్ని సవాళ్లు విసిరినా జవాబు చెప్పరు. రజతోత్సవం కోసం వరంగల్ సభకు పైనుంచి ఊడిపడ్డారు. మళ్లీ మెరుపులా మాయమయ్యారు’.. ఇలా కాంగ్రెస్ శ్రేణులు గులాబీ బాస్ గురించి సోషల్ మీడియాలో తెగ కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్గా హస్తం నేతల చేతికి మరో అస్త్రం చిక్కింది.
‘ప్రధాని మోదీ. వీరుడు, ధీరుడు, శూరుడు. దేశంలోకే బలమైన నాయకుడు. మాటల మాంత్రికుడు. అతిపెద్ద పార్టీకి దేవుడు. బీజేపీ ముందు కాంగ్రెస్ పిల్లకాకి. మోదీ ముందు రాహుల్గాంధీ బచ్చా’.. కాషాయ దళాన్ని కదిలిస్తే ఇలాంటి డైలాగులు చాలానే చెబుతారు. సోషల్ మీడియా పోస్టులతో చెలరేగిపోతుంటారు.
కేంద్రం మెడలు వంచి..
ఇటు కేసీఆర్, అటు మోదీ. ఇటు బీఆర్ఎస్, అటు బీజేపీ. అందరికీ ఒకే ఒక దెబ్బతో ఇచ్చిపడేసింది కాంగ్రెస్. కులగణనతో ఆ రెండు పార్టీలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాక్. కులగణన ఈ పదమే చాలా బోరింగ్గా ఫీల్ అయ్యేవారు చాలామంది. కానీ, అదెంత పదునైన అస్త్రమో ఇప్పుడిప్పుడే తెలిసొస్తోంది. క్యాస్ట్ సెన్సెస్ను జాతీయ స్థాయి నినాదంగా మార్చిన ఘనత రాహుల్గాంధీదే. దేశానికి ఎక్స్రే అంటూ భారత్ జోడో యాత్రతో దేశమంతా కాలినడకన తిరిగి ఊదరగొట్టారు. రాహుల్ నినాదాన్ని అందిపుచ్చుకున్న సీఎం రేవంత్రెడ్డి.. కష్టసాధ్యమనుకున్న కులగణనను చాలా ఈజీగా సుసాధ్యం చేసి చూపించారు. తెలంగాణలో కులగణన కంప్లీట్ చేయడం.. అసెంబ్లీలో ఆమోదం.. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు.. అన్నీ చకచకా ఫినిష్ చేశారు. సీఎం రేవంత్ చర్యతో.. బీజేపీ డిఫెన్స్లో పడింది. కులగణన సాధ్యం కాదని చెప్పలేకపోయింది. రాహుల్ విజన్, రేవంత్ యాక్షన్కు.. మోదీ సైతం తలవంచాల్సి వచ్చింది. 2026 జనగణనతో పాటు కులగణన కూడా చేపడతామంటూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి వచ్చింది. ఈ నిర్ణయం ముమ్మాటికీ.. రాహుల్గాంధీ, రేవంత్రెడ్డిల విజయమే అవుతుంది. అందులో నో డౌట్. కట్ చేస్తే…
కేసీఆర్ స్టాండ్ ఏంటి?
కులగణనపై ఇప్పుడు కేసీఆర్, బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి? తెలంగాణలో సర్వే చేస్తే లైట్ తీసుకున్నారు. కులగణనకు సపోర్ట్ చేయలేదు.. అలాగని వ్యతిరేకించనూ లేదు. వ్యూహాత్మక మౌనంతో గులాబీ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూసిందనే విమర్శ వచ్చింది. కులగణన కోసం కేసీఆర్ ఫాంహౌజ్కు ప్రభుత్వ సిబ్బంది వెళితే.. లోనికి కూడా రానివ్వలేదు. కేటీఆర్ సైతం కులగణన సర్వేకు వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. హరీష్ సైతం ముఖం చాటేశారు. ఎందుకోగానీ, కేసీఆర్ కూతురు కవిత మాత్రం కులగణనకు కుటుంబ సమాచారం అందించారు. అంటే, కల్వకుంట్ల ఫ్యామిలీలోనే ఏకాభిప్రాయం లేదంటూ అప్పట్లో పెద్ద రచ్చే నడిచింది. బీసీ వ్యతిరేకులంటూ ముద్ర కూడా పడింది. అప్పుడు సరే.. ఇప్పుడు ఏంటి?
జనాభా లెక్కల్లో కేసీఆర్ చేరుతారా?
జనగణనతో పాటు అధికారికంగా కులగణన చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాదే గణన మొదలవుతోంది. ఇండియాలో ఉండే వారు ఎవరైనా జనాభా లెక్కలకు వివరాలు ఇవ్వాల్సిందే. దానితో పాటు కులం వివరాలు చెప్పాల్సిందే. అది రూల్. లేదంటే జనాభా లెక్కల్లో లేకుండా పోతారు. మరి, ఈసారి కేంద్ర చేపట్టనున్న కులగణనకు కేసీఆర్, కేటీఆర్, హరీష్రావులు డీటైల్స్ ఇస్తారా? రేవంత్ సర్కార్ చేపట్టిన సర్వేకు ససేమిరా అన్నారు. మరి, మోదీ చేసే కులగణన విషయంలో ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు? జనాభా లెక్కలతో పాటే చేస్తారు కాబట్టి.. ఈసారి కులగణన నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదా? రేవంత్ సర్కార్కు నో చెప్పి.. మోదీ ప్రభుత్వానికి జీహుజూర్ అంటారా? వివరాలు ఇస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఒకే టీమ్ అంటారు.. ఇవ్వకపోతే జనాభా లెక్కల్లో మిస్ అవుతారు.. గులాబీ దళానికి పెద్ద ఫిట్టింగే వచ్చిపడినట్టుంది అంటున్నారు.
Also Read : తెలంగాణలో కొత్త పాలసీ.. సీఎం రేవంత్ కీలక ప్రకటన