Maoist Ganapathi: స్వేచ్ఛ బ్యూరో: కొన్ని దశాబ్ధాలపాటు మావోయిస్టు పార్టీకి దిశా నిర్ధేశం చేసిన అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఎక్కడ?. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన 130మంది మావోయిస్టుల్లో గణపతి లేకపోవటంతో ప్రస్తుతం ఇది చర్చనీయంగా మారింది. కొన్నేళ్లపాటు మావోయిస్టు పార్టీకి సుప్రీంగా వ్యవహరించిన గణపతి ఆరోగ్య సమస్యల కారణంగా బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన కొంతకాలం దండకారణ్యంలోనే ఉన్నారని పోలీసు వర్గాలు చెప్పాయి.
అయితే, ఆరోగ్య సమస్యలు అధికం కావటంతో ఆయన పట్టణ ప్రాంతాలకు వెళ్లిపోయినట్టుగా తమకు సమాచారం ఉందని పేర్కొన్నాయి. ఇటీవల దేవ్ జీ, మల్లా రాజిరెడ్డి తదితరులు లొంగిపోయిన సమయంలో గణపతి నేపాల్ దేశంలో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. ప్రస్తుతం ఆయన కదలలేని స్థితిలో ఉన్నారని ప్రచారం జరిగింది. దాంతోపాటు ఎస్ఐబీ నుంచి ఓ ప్రత్యేక బృందం నేపాల్ వెళ్లి లొంగిపోయేందుకు గణపతిని ఒప్పించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. ఇక, గణపతి సోదరుడు, కుమారుడు కూడా జన జీవన స్రవంతిలోకి రావాలని మనసారా కోరుకుంటున్నామని సోషల్ మీడియా ద్వారా మెసెజీలు పెట్టారు.
Also read: Praja Palana: 99 రోజుల ప్రణాళిక పై ఆ రోజు అందరూ లెక్క చెప్పాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్
ఈ నేపథ్యంలో గణపతి లొంగిపోవటం లాంఛనమే అని అంతా అనుకున్నారు. ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన సరెండర్ కానున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా, 130మంది మావోయిస్టులు లొంగిపోగా వారిలో గణపతి కూడా ఉన్నట్టు అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా గణపతి సరెండర్ కాలేదు. దాంతో ప్రస్తుతం ఆయన ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు లొంగిపోనున్నారు? అన్నది సర్వత్రా చర్చనీయంగా మారింది.
Also Read: Summer Tips: ఎండాకాలంలో మీ ఇంటిని ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకోండి ఇలా!